విశాలాంధ్ర బ్యూరో`ఒంగోలు : జిల్లాలోని ప్రతి విద్యార్థికి లక్ష్యంపై స్పష్టమైన అవగాహన కల్పించడమే ధ్యేయంగా కెరీర్ గైడెన్స్ కార్యక్రమాన్ని ప్రారంభించామని జిల్లా కలెక్టర్ ఏఎఎస్ దినేష్కుమార్ స్పష్టం చేశారు. గురువారం ఒంగోలులోని స్థానిక ఏకెవికె కాలేజీలో జూనియర్ కాలేజీల లెక్చరర్లు మరియు యాజమాన్యాలతో నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తాను పల్లెనిద్రలో భాగంగా కంభం సాంఘిక సంక్షేమ హాస్టల్కు వెళ్లానన్నారు. అక్కడ విద్యార్థులతో మాట్లాడుతుంటే వారికి కెరీర్ మీద వగాహన లేకపోవడం, నిర్ధిష్ట లక్ష్యాలను ఏర్పరచుకోకపోవడం గమనించానన్నారు. ఒక విద్యార్థి తనతో మాట్లాడుతూ విద్యపై తమకు ఆసక్తి ఉన్నప్పటికీ, ఏమీ చదవాలో, ఎలా చదవాలో తమకు ఎవరూ అవగాహన కల్పించలేదన్నారని కలెక్టర్ చెప్పారు. ఈ సమస్యను అధిగమించడానికి జిల్లాలోని అన్ని పాఠశాలలు, కాలేజీలు, సాంఘిక సంక్షేమ శాఖ హస్టళ్లలో చదివే విద్యార్థులకు కెరీర్ గైడరెన్స్పై అవగాహన కల్పించాలని నిర్ణయించామన్నారు. కెరీర్ గైడెన్స్ తరగతులు జిల్లాలోని ప్రతి ప్రభుత్వం, ప్రైవేటు జూనియర్ కాలేజీలలో కచ్చితంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ అన్నారు. ఈ ఓరియంటేషన్ కార్యక్రమానికి వచ్చిన లెక్చరర్లు అందరూ తమ కాలేజీ విద్యార్థులకు లక్ష్యాల ఎంపిక, వాటిని సాధించడానికి ఉన్న మార్గాలపై అవగాహన కల్పించాలని ఆయన చెప్పారు. ఈ ఓరియంటేషన్ 22 వారాల పాటు జరుగుతుందన్నారు. ప్రతి శుక్రవారం ఒక గంటపాటు ఈ తరగతిని కచ్చితంగా నిర్వహించాలన్నారు. ఈ తరగతులు పూర్తయ్యే సరికి ప్రతి విద్యార్థి వతమ లక్ష్యాలకు సంబంధించి స్పష్టమైన ఆలోచనను కలిగి ఉండేలా ఈ బోధన జరగాలన్నారు. కెరీర్ గైడెన్స్కు సంబంధించిన మెటీరియల్ తయారు చేశామని, ఆ మెటీరియల్ని మెంటర్లందరికీ ఇస్తామన్నారు. లెక్చరర్లతో పాటు తల్లిదండ్రులు చెప్పేమాటలు, మీడియాలో వచ్చే కథనాలు, సినిమాలు కూడా విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేస్తాయన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమానికి ఇంజనీరింగ్, డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు తన దగ్గరకు వచ్చి కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు ఇవ్వాలని అర్జీలు ఇస్తున్నారని కలెక్టర్ అన్నారు. వారు చదువుకునే రోజుల్లో వారికి సరైన అవగాహన కల్పించకపోవడం వలనే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ప్రతి విద్యార్థికి ఉద్యోగం ఇవ్వలేకపోవచ్చు కానీ వారికి అవసరమైన శిక్షణ ఇవ్వగలమని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగమే కాకుండా వ్యాపార రంగంపై కూడా ఆసక్తి ఉన్నవారిని గుర్తించి శిక్షణ ఇస్తామన్నారు. ప్రతి విద్యార్థి చేత కెరీర్ గైడెన్స్కు సంబంధించి ప్రత్యేకంగా నోట్బుక్ పెట్టించాలన్నారు. ప్రతి పాఠాన్ని వారు నోట్బుక్లో వ్రాస్తున్నారో లేదో గమనించాలన్నారు. విద్యార్థులు అడిగే ప్రతి ప్రశ్నకు కచ్చితమైన సమాధానం చెప్పాలన్నారు. ప్రతి లెక్చరర్ విద్యార్థులకు కెరీర్ గడైరెన్స్పై అవగాహన కల్పించడం ఒక అవకాశంలాగా భావించాలని కలెక్టర్ చెప్పారు. ఈ తరగతులను విజయవంతంగా పూర్తి చేసిన లెక్చరర్లను గుర్తించి వారికి ప్రశంసాపత్రాలను ఇస్తామన్నారు. ఈ తరగతులను నిర్వహించడం వలన ప్రతి విద్యార్థి తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుంటారని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ విజయభాస్కర్, జిల్లా పరిషత్ ఉప విద్యా అధికారి సామా సుబ్బారావు, డీవీఈఓ సుబ్బారావు, ఏకెవికె కాలేజీ చైర్మన్ నాగేశ్వరరావు, డరీసోర్సపర్సన్ రవీంద్ర ప్రసాదు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.