అధికారుల ఆత్మగౌరవంపై ప్రశ్నల దాడి
ప్రజాప్రాతినిధ్యానికి కళంకం
నేడు అర్ధవీడు సర్వసభ్య సమావేశం
విశాలాంధ్ర -అర్ధవీడు: క్షేత్ర స్థాయి పాలనలో పంచాయతీలకు ఆదర్శంగా నిలవాల్సిన అర్ధవీడు మండల పరిషత్ తప్పటడుగులు వేస్తోంది. ప్రజాప్రతిధులు పాల్గొనాల్సిన సర్వసభ్య సమావేశంలో షాడోలు అధికారులపై ప్రశ్నల దాడి చేస్తున్నారు. వారి ఆత్మ గౌరవాన్ని కించపరుస్తున్నారు. ఇది పరస్పర గౌరవం అనే మానవీయ సూత్రానికి భంగ పాటె. మహిళా ప్రతినిధుల స్థానంలో ప్రాతినిధ్య హక్కు లేని పురుషులు తమ హవా చాటుతున్నారు. తద్వారా ప్రజా ప్రాతిధ్య చట్టాన్ని అగౌర పరుస్తూ, మహిళా సాధికారత లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారు. పైగా ప్రతి పక్షం లేకపోవడం , ఉన్నత స్థాయి అధికారులు నివారించే సాహసం చేయలేకపోవడం వారి తప్పటడుగుల దూకుడు మితిమీరిపోతోంది. ఫలితంగా కొందరు అధికారులు రాజీ ధోరణి అనుసరిస్తున్నారు. ఇంకొందరు సమాచారాన్ని దాచి ప్రజా ప్రతినిధులను తమదైన శైలిలో తమ చుట్టూ తిప్పుకుంటున్నారు. పర్యవసానంగా ప్రజాసమస్యలు చర్చకు రావడంలేదు. ఈ నేపథ్యంలోనే రెండేళ్లుగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ విధులు నిర్వహించని ఎం ఎల్ హెచ్ పి లపై సమీక్ష లేదంటున్నారు. నెలవారీ వేతనాలు పొందుతూ వాహనాల్లో ఇంటింటికి బియ్యం పంపిణీ చేయక పొయినా స్పందించే వారు లేరు. వేళల్లో వేతనాలు తీసుకుంటూ వారంలో ఒకసారి కూడా ఆసుపత్రికి రాని వైద్యులను దారిలో పెట్టే ప్రయత్నమూ జరగడంలేదు. గ్రామాల్లోని ఓవర్ హెడ్ , మినీ ట్యాంకుల్లో పిడికెడు భ్లీచింగ్ చల్లించలేని దుస్థితి నెలకొనడం పాలకుల, అధికారుల వైఖరుల్లోని పరస్పర అవిశ్వాసానికి , అపనమ్మకానికి నిదర్సనంగా చెబుతున్నారు. ఇప్పటికైనా తమ స్వీయ నియంత్రణ ద్వారా గ్రామీణ ప్రజాస్వామ్యానికి మెరుగైన బాటలు వేయాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయంలో ప్రజా ప్రతినిధులు ఒక అడుగు మందుకు వేయాలని ఆశిస్తున్నారు.