విశాలాంధ్ర – నాగులుప్పలపాడు :- ఉప్పుగుండూరు గ్రామపంచాయతీ నిధులు అక్రమాల వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో శనివారం డీఎల్పిఓ పద్మావతి విచారణ చేపట్టారు. ఉత్తమ పంచాయతీగా పేరొందిన ఉప్పుగుండూరు గ్రామపంచాయతీలో జూనియర్ అసిస్టెంట్ శ్రీరామ్ మూర్తి ఇన్చార్జి కార్యదర్శిగా పనిచేసిన సమయంలో పంచాయతీ నిధుల వ్యవహారంలో అక్రమాలు జరిగినట్లు అందులో పంచాయతీ కంప్యూటర్ అసిస్టెంట్ వెంకట్రావు పాత్ర కూడా ఉన్నట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. దాంతో డి ఎల్ పి ఓ పద్మావతి గత 5 రోజుల క్రితం ఒక దఫా విచారణ చేపట్టగా రెండో దఫా ఉప్పుగుండూరు పంచాయతీ కార్యాలయంలో విచారణను నిర్వహించారు. గ్రామ సర్పంచ్ దేవరకొండ జయమ్మ జూనియర్ అసిస్టెంట్ శ్రీరామ్ మూర్తి పంచాయతీ అధికారుల సమక్షంలో విచారణ చేపట్టారు. గ్రామ పంచాయతీకి మంజూరైన నిధులు ఇంటి, కొళాయి పన్ను వసూళ్లు, వాటర్ ప్లాంట్ ద్వారా వచ్చిన ఆదాయం, తోపాటు ఉప్పుగుండూరు గ్రామపంచాయతీకి ప్రభుత్వం ద్వారా వచ్చిన ఆదాయం జమా ఖర్చులు వివరాలు రికార్డులను పరిశీలించారు విచారణ మరో రెండు మూడు రోజులు పాటు జరగనున్నట్లు డిఎల్పిఓ పద్మావతి తెలిపారు. ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉండా ఉప్పుగుండూరు గ్రామపంచాయతీలో అధికారులు అవినీతికి పాల్పడడంపై ఆవేదన వ్యక్తం చేస్తూ 14వ వార్డు మెంబర్ కనగాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పలువురు గ్రామస్తులు అవినీతికి పాల్పడిన అధికారులను సస్పెండ్ చేసి నిధులు రికవరీ చేయాలని కోరుతూ డిఎల్పిఓ పద్మావతికి వినతి పత్రం అందజేశారు.