- నిస్తేజంగా ప్రకాశం పంతులు జయంతి
- ప్రజాప్రతినిధులకు అందని వర్తమానం
- ఎంపీడీవో తీరుపై ప్రజాప్రతినిధుల ఆగ్రహం కలెక్టర్కు ఫిర్యాదు
విశాలాంధ్ర నాగులుప్పలపాడు : నాగులుప్పలపాడు మండలంలో ఇన్చార్జ్ ఎంపీడీవో తీరుపై సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి . స్ఫూర్తిమంతంగా జరగాల్సిన ప్రకాశం పంతులు జయంతిని నిస్తేజంగా నిర్వహించడం ఇందుకు తార్కాణంగా నిలుస్తోంది . ప్రజాప్రతినిధులకు కనీసం సమాచారం కూడా ఇవ్వకపోవడంతో వారు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు . గతంలోనూ కొత్త పింఛన్ల పంపిణీ వ్యవహారంలో ఏకపక్షంగా వ్యవహరించడంతో ఆయనపై గతంలోనూ కలెక్టర్కు ఫిర్యాదు చేయడం గమనార్హం . ఏటా ప్రకాశం పంతులు జయంతిని ఆయన స్వగ్రామం వినోదరాయునిపాలెంలో స్ఫూర్తిమంతంగా నిర్వహించడం గమనార్హం . ఈ కార్యక్రమం ఏర్పాట్ల కోసం మండలంలోని వివిధ పాఠశాలల విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు . ఇక ప్రజాప్రతినిధులు , జిల్లా స్థాయి అధికారులు కూడా హాజరయ్యి ఘనంగా నిర్వహించే వారు . అయితే ఈ ఏడాది నాగులుప్పలపాడు ఇన్చార్జ్ ఎంపీడీవో వై శ్రీనివాసరావు ఏకపక్షంగా ‘ అంతా నాఇష్టం ‘ అన్న తీరుగా నిర్వహించడంతో కార్యక్రమం స్ఫూర్తే దెబ్బతింది . ఈ కార్యక్రమానికి కనీసం గ్రామ సర్పంచుకు కూడా సమాచారం కూడా లేకపోవడం గమనార్హం . దీంతో మొక్కుబడిగా కొద్దిమంది అధికారులు వినోదరాయునిపాలెంలోని ప్రకాశం పంతులు విగ్రహం వద్ద నివాళి అర్పించారు . ఇక ప్రజా ప్రతినిధులు స్థానిక ఎంపీడీవో కార్యాలయంలోనే ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు . దీంతో ఈ కార్యక్రమం మమాఅన్నట్లు సాగిపోయింది .
అందని ఆహ్వానాలు..
ప్రభుత్వం అద్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలకు ఎంపీపీ , జడ్పీటీసీ , ఇక మండలంలోని సర్పంచులు , ఎంపీటీసీలకు లేఖలు పంపించి సమాచారం అందిస్తారు . అయితే ఈ పర్యాయం కనీసం ఎంపీడీవో కార్యాలయం నుంచి ఆ మేరకు లేఖలు కూడా అందలేదు . ఇక పాఠశాలల విద్యార్థులు సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉండగా , ఆ ఊసే లేకుండా జరిగిపోయింది . ఇక మీడియా ప్రతినిధులకు సైతం ఎంపీడీవో సమాచారం ఇవ్వలేదు . వాట్సప్ గ్రూపుల్లో వచ్చిన సందేశాలు పంపడమే ఎక్కువ అన్నట్లు ఆయన వ్యవహరించడంతో కార్యక్రమానికి అటు ప్రజాప్రతినిధులు , మీడియా కూడా దూరంగా ఉంది .
ఎంపీడీవోపై ప్రజాప్రతినిధులు గరంగరం
ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండా ఇన్చార్జ్ ఎంపీడీవో సొంత ఎజెండాతో రాజకీయాలు చేస్తున్నారని ప్రజాప్రతినిధులు పేర్కొంటున్నారు . ఆ మేరకు ఎంపీడీవో తీరపై ఎంపీపీ నలమలుపు అంజమ్మ కృష్ణారెడ్డి , జడ్పీటీసీ సభ్యురాలు యాదల రత్న భారతీ అశోక్ బాబు , వినోదరాయునిపాలెం సర్పంచ్ ఘట్టమనేని అశోక్ ఆగ్రహం వ్యక్తం చేశారు . ఎంపీడీవో కార్యాలయం వద్ద నిరసన తెలిపి అనంతరం ఒంగోలు లో కలెక్టరు కు ఫిర్యాదు చేశారు . విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎంపీడీవోపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని మంగళవారం సాయంత్రం కలెక్టర్కు ఫిర్యాదు చేశారు .