న్యూదిల్లీ: ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్కు ముందు భారత్కు శుభవార్త అందింది. ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్లో 15 నెలల నుంచి టాప్లో ఉన్న ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి భారత్ అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఇటీవల ముగిసిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని టీమ్ఇండియా 2-1 తేడాతో గెల్చుకుని ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో రెండో స్థానంలో నిలిచి డబ్ల్యూటీసీ ఫైనల్కు అర్హత సాధించింది. అయితే ఐసీసీ తాజాగా వార్షిక ర్యాంకింగులను అప్డేట్ చేసింది. దీని ప్రకారం 121 రేటింగ్ పాయింట్లతో టీమ్ఇండియా అగ్రస్థానంలో నిలవగా… 116 రేటింగ్ పాయింట్లతో ఆస్ట్రేలియా రెండో స్థానం దక్కించుకుంది. డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. జూన్ 7-11 తేదీల్లో లండన్లోని ఓవల్ మైదానం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఒకవేళ మ్యాచ్ ఫలితం తేలకుంటే 12వ తేదీని రిజర్వ్ డేగా ప్రకటించారు. ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచ్ కోసం బీసీసీఐ ఇటీవల భారత్ జట్టును ప్రకటించింది.
ఇద్దరికి గాయాలు… ఆందోళనలో టీమ్ఇండియా
డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడే భారత జట్టులో ఉన్న కేఎల్ రాహుల్, జయదేవ్ ఉనద్కత్ గాయాలపాలయ్యారు. ఆర్సీబీతో మ్యాచ్లో డుప్లెసిస్ షాట్ను అడ్డుకునే క్రమంలో రాహుల్ కుడి తొడకు గాయమవగా…ఈ మ్యాచ్కు ముందు నెట్ ప్రాక్టీస్లో ఉనద్కత్ బౌలింగ్ చేస్తూ కిందపడటంతో ఎడమ భుజానికి గాయమైంది. ఈ రెండు గాయాలు తీవ్రంగానే కనిపిస్తుండడం టీమ్ఇండియాను ఆందోళనకు గురిచేస్తోంది. ఒకవేళ గాయాలతో వీళ్లిద్దరూ డబ్ల్యూటీసీ ఫైనల్కు దూరమైతే యశస్వి జైస్వాల్, అర్ష్దీప్ సింగ్లను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. జైస్వాల్ను కాదనుకుంటే ఇషాన్కిషన్, అభిమన్యు ఈశ్వరన్లలో ఒకరికి అవకాశం దక్కవచ్చు.
డబ్ల్యూటీసీ ఫైనల్కు భారత జట్టు
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, పుజారా, విరాట్ కోహ్లీ, రహానె, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, షమీ, సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్.