బులవాయో : ఈ ఏడాది భారత్లో జరగనున్న వన్డే ప్రపంచ కప్నకు నెదర్లాండ్స్ అర్హత సాధించింది. గురువారం జరిగిన ప్రపంచకప్ క్వాలిఫయర్స్ సూపర్ సిక్స్ మ్యాచ్లో నెదర్లాండ్స్ 4 వికెట్ల తేడాతో స్కాట్లాండ్పై గెలుపొంది ఆఖరి బెర్తును ఖరారు చేసుకుంది. నెదర్లాండ్స్ ఆటగాడు బాస్ డి లీడే ఆల్రౌండ్ ప్రదర్శన కనబర్చి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మొదట స్కాట్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. బ్రాండన్ మెక్ముల్లెన్ సెంచరీ (106 పరుగులుÑ110 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్లు) సాధించగా, కెప్టెన్ రిచీ బెరింగ్టన్ (64) అర్ధ శతకంతో మెరిశాడు. నెదర్లాండ్స్ బౌలర్లలో బాస్ డి లీడే (5/52) ఆకట్టుకున్నాడు. ర్యాన్ క్లైన్ రెండు వికెట్లు పడగొట్టాడు. బౌలింగ్లో అదరగొట్టిన బాస్ డి లీడే (123 పరుగులుÑ 92 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్లు) బ్యాటింగ్లోనూ సత్తాచాటడంతో 278 పరుగుల భారీ లక్ష్యాన్ని నెదర్లాండ్స్ 42.5 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. క్వాలిఫయర్స్ సూపర్ సిక్స్లో ఆడిన నాలుగు మ్యాచ్ల్లో విజయం సాధించిన శ్రీలంక ఇప్పటికే ప్రపంచ కప్ బెర్తును ఖరారు చేసుకున్న సంగతి తెలిసిందే. స్కాట్లాండ్పై తాజా విజయంతో నెదర్లాండ్స్ పదో జట్టుగా ప్రపంచకప్లో ఆడే అవకాశాన్ని సొంతం చేసుకుంది. పాయింట్ల పట్టికలో స్కాట్లాండ్, జింబాబ్వే… నెదర్లాండ్స్తో (6 పాయింట్లు) సమానంగా ఉన్నాయి. అయితే, స్కాట్లాండ్పై భారీ విజయంతో నెదర్లాండ్స్ మెరుగైన రన్రేట్ సాధించి ప్రపంచ కప్కు అర్హత సాధించింది.