కోల్కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్ 9వ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) … రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) పై ఘన విజయం సాధించింది. కోల్కతా హోమ్ గ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్ మైదానంలో గురువారం జరిగిన ఈ మ్యాచ్లో బ్యాటింగ్, బౌలింగ్లోనూ మెరిసి కోల్కతా జట్టు 81 పరుగుల తేడాతో ఏకపక్షంగా విజయం సాధించింది. బ్యాటర్లు శార్దూల్ ఠాకూర్ (68), రెహ్మనుల్లా గుర్బాజ్ (57), రింకు సింగ్ (46) రాణించగా..స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి (4/15), సుయాశ్ శర్మ (3/30), సునీల్ నరైన్ (2/16) చెలరేగి బెంగళూరును కుప్పకూల్చారు. దీంతో ఆర్సీబీ రెండు ఓవర్లు మిగిలి ఉండగానే 123 పరుగులకే కుప్పకూలింది.
ఈ మ్యాచ్లో కేకేఆర్ జట్టులో 19 ఏళ్ల లెగ్ స్పిన్ బౌలర్ సుయాశ్ శర్మ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అతని బౌలింగ్ యాక్షన్తోపాటు అతని లుక్ కారణంగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాడు. ఒలింపిక్ బంగారు పతక విజేత నీరజ్ చోప్రాలా ఉన్నావంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్గా అరంగేట్రం చేసిన సుయాశ్ శర్మ… తన మొదటి మ్యాచ్లోనే 4 ఓవర్లలో 30 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఇందులో దినేష్ కార్తీక్, అనుజ్ రావత్, కర్ణ్ శర్మల వికెట్లు ఉన్నాయి. సుయాష్ శర్మ తన నుదిటిపై బ్యాండ్ ధరించి కనిపించడంతో పాటు, తన జట్టు యజమాని, బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ శైలిలో కూడా కనిపించాడు.
మమత అభినందన
ఐపీఎల్లో తొలి విజయాన్ని నమోదు చేసిన కోల్కతా నైట్రైడర్స్ జట్టును పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ప్రత్యేకంగా అభినందిచారు. ఈ విజయం చాలా ప్రత్యేకమైందని పేర్కొన్నారు. ‘‘ఐపీఎల్-16లో కేకేఆర్ తొలి విజయాన్ని నమాదుచేసింది. ఈ విజయం చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే ప్రస్తుత సీజన్లో ఈడెన్ గార్డెన్స్ మైదానంలో కేకేఆర్ ఆడిన తొలి మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్లో ఆటగాళ్లందరూ అత్యుత్తమ స్థాయిలో ఆడారు. జట్టుకు నా హృదయపూర్వక అభినందనలు. రాబోయే మ్యాచులకు గుడ్లక్’’ అని మమతా బెనర్జీ ట్వీట్ చేశారు.