లండన్ : ఓవల్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులోనూ దిగ్గజ స్పిన్నర్ అశ్విన్ను టీమిండియా ఎంచుకోకపోవడంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అశ్విన్ లాంటి గొప్ప ఆటగాడికి ఆడే అవకాశం ఇవ్వకపోవడం వాళ్ల పిచ్చితనమే అంటూ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ట్వీట్ చేశాడు. ఇంగ్లాండ్తో మూడో టెస్టు ఓటమి తర్వాత టీమిండియా నాలుగో టెస్టులో కచ్చితంగా విజయం సాధించాలనే ఉద్దేశంతో జట్టులో రెండు మార్పులు చేసింది. ఉమేశ్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ తుది జట్టులోకి రాగా.. ఇషాంత్, మహ్మద్ షమికి విశ్రాంతినిచ్చారు. అలాగే ఈ మ్యాచ్లోనైనా సీనియర్ ఆఫ్స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను తుది జట్టులోకి తీసుకుంటారని ఆశించినా అదీ జరగలేదు. అతడిని మరోసారి రిజర్వ్ బెంచ్కే పరిమితం చేసి జడేజాను తీసుకోవడం గమనార్హం. వాన్ స్పందిస్తూ.. ‘ఇంగ్లాండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులోనూ రవిచంద్రన్ అశ్విన్ను ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 413 వికెట్లు.. 5 సెంచరీలు సాధించిన అద్భుతమైన ఆటగాడికి ఆడే అవకాశం ఇవ్వకపోవడం వారి పిచ్చితనమే!’ అని టీమిండియానుద్దేశించి ట్వీట్ చేశాడు.