సిడ్నీ : ఒమన్, యూఏఈ వేదికగా జరగనున్న టీ20 క్రికెట్ ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియా 15 మంది సభ్యులతో కూడిన తన జట్టును గురువారం ప్రకటించింది. వెస్టిండీస్, బంగ్లాదేశ్ పర్యటనకు దూరంగా ఉన్న ఆసీస్ స్టార్ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మ్యాక్స్వెల్, పాటన్ కమిన్స్ తిరిగి జట్టులోకి వచ్చేశారు. వీరితోపాటు యువ కీపర్ జోష్ ఇంగ్లిష్కు కొత్తగా అవకాశం ఇచ్చారు. ప్రధాన వికెట్ కీపర్ మాథ్యూ వేడ్కు ప్రత్యామ్నాయంగా ఇతడిని తీసుకున్నారు. మోకాలు శస్త్రచికిత్స కారణంగా బంగ్లాదేశ్ సిరీస్కు దూరంగా ఉన్న ఫించ్.. ప్రపంచకప్ వరకు కోలుకుంటాడని ఆస్ట్రేలియా క్రికెట్ యాజమాన్యం భావిస్తోంది. అలాగే స్మిత్ కూడా మోచేతి గాయం నుంచి బయటపడతాడని ఆశిస్తోంది. కీపర్ అలెక్స్ కారే, ఆల్రౌండర్ హెన్రిక్స్, ఆండ్రూ టై, జోష్ ఫిలిప్, ఆష్టన్ టర్నర్లు జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు. కాగా 15మంది గల జట్టులో స్టోయినిస్, కేన్ రిచర్డ్సన్లకు స్థానం దక్కింది. ఇప్పటివరకు ఐదు వన్డే ప్రపంచకప్ టైటిళ్లను గెలుచుకుని ఆస్ట్రేలియా రికార్డు సృష్టించింది కానీ టీ20 ప్రపంచకప్ను మాత్రం గెలవలేకపోయింది. ఇటీవల బంగ్లాదేశ్, వెస్డిండీస్లతో జరిగిన టీ20 సిరీస్ల్లోనూ ఓటమి చవిచూసింది. దీంతో త్వరలో ప్రారంభంకాబోయే ప్రపంచకప్లో పటిష్ఠ జట్టుతో బరిలో దిగాలవి భావిస్తోంది. టీ20 వరల్డ్కప్కు ఆస్ట్రేలియా జట్టు: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), పాట్ కమిన్స్ (వైస్ కెప్టెన్), ఆష్టన్ అగార్, జోష్ హెజిల్వుడ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్వెల్, కేన్ రిచర్డ్సన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, స్టోయినిస్, మైఖెల్ స్వెప్సన్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా.