లండన్ : ఐసీసీ టీ20 ప్రపంచకప్లో ఈసారి ఆస్ట్రేలియా జట్టు విజేతగా నిలిచే అవకాశం ఉందని ఆ దేశ స్టార్ బ్యాట్స్మన్ గ్లెన్ మ్యాక్స్వెల్ జోస్యం చెప్పాడు. ఇలాంటి మెగా టోర్నీకి ముందు ఐపీఎల్ ఆడడం కలిసొచ్చే అంశమని అభిప్రాయపడ్డాడు. ఇటీవల జరిగిన టీ20 సిరీస్లలో ఆస్ట్రేలియా జట్టు పేలవ ప్రదర్శన చేసినా.. టీ20 ప్రపంచకప్లో ఉత్తమంగా రాణిస్తామని ధీమా వ్యక్తం చేశాడు.
‘‘మా(ఆస్ట్రేలియా) జట్టు లైనప్ ఎంతో బలంగా ఉంది. మ్యాచ్ను సునాయాసంగా గెలిపించగలిగే విజేతలు చాలా మందే ఉన్నారు. మాకంటూ ఒకరోజు వస్తుంది. అప్పుడు ఏ టీమ్ అయినా మా ప్రదర్శనతో పైచేయి సాధిస్తాం. ఆ సమయంలో మమ్మల్ని ఆపటం ఎవరికీ సాధ్యం కాదు’’ అని మ్యాక్స్వెల్ చెప్పుకొచ్చాడు. అయితే ప్రస్తుతం ఏ జట్టు బలహీనమైనది కాదని.. కష్టపడి ఆడితే ఎవరైనా విజయం సాధించొచ్చని ముక్తాయింపునిచ్చాడు.
టీ20 ప్రపంచకప్కు ఆసీస్ జట్టు : ఆరోన్ ఫించ్(కెప్టెన్), డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, జోష్ హజల్వుడ్, మిచెల్ స్టార్క్, మాథ్యూ వేడ్, ఆస్టన్ అగర్, జోష్ ఇంగ్లీష్, కేన్ రిచర్డ్సన్, పాట్ కమిన్స్, మిచెల్ మార్ష్, స్వీప్సన్, ఆడమ్ జంపా.
రిజర్వు బెంచ్ : డానియల్ క్రిస్టియన్, నాథన్ ఎల్లిస్, డానియల్ సామ్స్.
టీమిండియా కూడా టైటిల్ ఫేవరెట్టే : బ్రాడ్ హాగ్
ఇంగ్లండ్, న్యూజిలాండ్ ప్రస్తుతం టీ20 ఫార్మాట్లో అత్యుత్తమ జట్లు.. టైటిల్ గెలుచుకునే రేసులో ఈ రెండు జట్లే ముందుంటాయని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు బ్రాడ్ హాగ్ పేర్కొన్నాడు. అయితే, ఆ రెండు జట్లకు గట్టి సవాల్ విసరగలిగేది టీమిండియా అని స్పష్టం చేశాడు. కాగా ఇంగ్లండ్ 2010 లో టీ20 ప్రపంచకప్ను కైవసం చేసుకుంది. అదే విధంగా.. ఇటీవల శ్రీలంక ,పాకిస్తాన్లతో జరిగిన టీ20 సీరీస్లో విజయం సాధించి ఇంగ్గండ్ హాట్ ఫేవరేట్గా బరిలోకి దిగనుంది. మరో వైపు శ్రీలంక, బంగ్లాదేశ్లతో ఇటీవల జరిగిన టీ 20 సిరీస్లో భారత్, న్యూజిలాండ్ ఓటమి చెందాయి. కానీ ఈ సిరీస్లో రెండు జట్లు తమ సీనియర్ ఆటగాళ్లతో బరిలోకి దిగలేదు. టీ20 ప్రపంచకప్ గ్రూప్ 2 లో భారత్, న్యూజిలాండ్ ఉన్నాయి. అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకూ యూఏఈ, ఒమన్ వేదికగా ఈ మెగా టోర్నీ జరగనుంది.