న్యూదిల్లీ: ప్రపంచ క్రికెట్లో ఆరు గంటలపాటు టీమిండియా అగ్రస్థానం ప్రస్థానం కొనసాగింది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) పొరపాటు కారణంగా భారత్ మూడు ఫార్మట్లలో నంబర్ వన్గా నిలిచింది. తప్పిదాన్ని సరిద్దిద్దిన ఐసీసీ.. తిరిగి ఆస్ట్రేలియాను అగ్రస్థానంలోకి తీసుకొచ్చి తమ అధికారిక వెబ్సైట్లో పేర్కొన్నది. బుధవారం ఐసీసీ తన వెబ్సైట్లో టెస్టుల్లో భారత్ను అత్యుత్తమ జట్టుగా చూపించింది. దాంతో అన్ని ఫార్మట్లలో టీమిండియా నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నది. అయితే, జరిగిన పొరపాటును గ్రహించిన ఐసీసీ.. 6 గంటల తర్వాత మళ్లీ కొత్త ర్యాంకింగ్స్ను విడుదల చేసింది. దీనిలో టీమిండియా మళ్లీ రెండోస్థానంలోని వచ్చింది. ఈ పొరపాటు ఎలా జరిగింది..? ఎందుకు జరిగింది..? ఎవరు చేశారు..? అనే విషయాలపై ఐసీసీ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. భారత్ ప్రస్తుతం టీ 20, వన్డేల్లో నంబర్ వన్గా ఉన్నది. టెస్టుల్లో నంబర్ రెండో స్థానంలో ఉన్నది. ర్యాంకింగ్లో ఆస్ట్రేలియా 126 పాయింట్లతో అగ్రస్థానంలో టీమిండియా 115 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ తదుపరి మ్యాచ్ 17 నుంచి దిల్లీలో జరగనున్నది. ఈ మ్యాచ్లో ఇండియా గెలిచి సిరీస్ను కైవసం చేసుకుంటే.. అప్పుడు టీమిండియా నంబర్ వన్గా మారుతుంది. అప్పుడు భారత్కు 121 పాయింట్లు, ఆస్ట్రేలియాకు 120 పాయింట్లు ఉంటాయి. ఈ ఏడాది జనవరి 18న కూడా ర్యాంకింగ్స్లో ఇదే పెద్ద తప్పు ఐసీసీ చేసింది. తన అధికారిక వెబ్సైట్లో మధ్యాహ్నం 1:30 గంటలకు టీమిండియాను నంబర్ 1 టెస్ట్ జట్టుగా ప్రకటించారు. రెండున్నర గంటల తర్వాత భారత్ను నంబర్1 నుంచి నంబర్ 2 కి మార్చారు. ఆస్ట్రేలియా మళ్లీ నంబర్ 1 టెస్టు జట్టుగా అవతరించింది. అయితే, ర్యాంకింగ్స్లో జరిగిన ప్రధాన లోపంపై ఐసీసీ అధికారిక ప్రకటన ఏదీ విడుదల చేయలేదు.