మాంచెస్టర్ : భారత్, ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన ఐదో టెస్టు మ్యాచ్ను ప్రారంభానికి కొన్ని గంటల ముందు రద్దు చేశారు. కరోనా భయంతోనే మ్యాచ్ను రద్దు చేసినట్టు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ప్రకటించింది. భారత శిబిరంలో కరోనా కలకలం కారణంగానే మొదటి నుంచి ఐదో టెస్టుపై అనుమానం నెలకొంది. నాల్గో టెస్టుకు ముందు భారత హెడ్ కోచ్ రవిశాస్త్రితో పాటు మరికొందరు సహాయక సిబ్బంది కరోనా బారిన పడ్డారు. దీంతో వారు ఆ టెస్టుకు దూరం అయ్యారు. ఆ తర్వాత తాజాగా మరో సహాయక సిబ్బందికి కరోనా సోకింది. దాంతో గురువారం జట్టు సభ్యులందరికీ కరోనా టెస్టు నిర్వహించారు. సభ్యులందరకీ నెగెటివ్ రావడంతో మ్యాచ్కు ఇబ్బందిలేదనే భావించారు. కానీ, చివరి నిమిషంలో రెండు జట్లు తొలి రోజు ఆటను రద్దు చేయాలని నిర్ణయించాయి. ఈ మేరకు రెండు దేశాల క్రికెట్ బోర్డులు కూడా అంగీక రించాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే మ్యాచ్ మొత్తాన్ని రద్దు చేస్తున్నట్లు ఈసీబీ ప్రకటిం చింది. బీసీసీఐతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఇక ఐదు మ్యాచుల టెస్టు సిరీస్లో కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా 2-1 తేడాతో ఆధిక్యంలో ఉన్న విషయం విదితమే.
రంగంలోకి దాదా
ఐదో టెస్టుమ్యాచ్ రద్దు కావడం వల్ల రెండు జట్లకూ భారీ మొత్తంలో నష్టం వాటిల్లే అవకా శం ఉండటంతో మ్యాచ్ను రీషెడ్యూల్ చేయడా నికి బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ రంగంలోకి దిగాడని తెలిసింది. ఆయన ఈ నెల 22న ఇంగ్లండ్ వెళ్తాడని సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మ్యాచ్ను నిలిపివేసినా భవిష్యత్తులో తిరిగి నిర్వహించడానికి బీసీసీఐ ఆసక్తి చూపుతోంది. ఈ మేరకు ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) తోనూ సంప్రదిం పులు జరుపుతోంది. ఇదే విషయంపై ఈసీబీ ప్రతినిధులతో గంగూలీ చర్చించనున్నాడు. ఈసీబీతో పాటు మ్యాచ్ ప్రసార హక్కుదారులతో కూడా గంగూలీ చర్చలు జరుపుతాడని సమాచారం.