న్యూదిల్లీ : భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవికి గుడ్బై చెప్పేస్తానని రవిశాస్త్రి బీసీసీఐకి సమాచారం ఇచ్చినట్లు ఆంగ్ల మీడి యాలో వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఐసీసీ టీ20 ప్రపంచకప్ తర్వాత శాస్త్రి కోచ్ పదవికి వీడ్కోలు పలకనున్నాడని, దీంతో బీసీసీఐ ఇతర మార్గాలు అన్వే షిస్తోందని వార్తలు వస్తున్నాయి. ప్రపంచకప్ ముగిసిన తర్వాత రవిశాస్త్రి ఒప్పందం ముగుస్తుంది. దాంతో బీసీసీఐ మళ్లీ ప్రధాన కోచ్, సహాయ కోచ్ల కోసం కొత్తగా దరఖాస్తులు ఆహ్వా నిస్తుంది. కోచ్ పదవికి వయో పరిమితి ఎప్పటిలాగే 60 ఏళ్లు ఉంటుంది. దరఖాస్తులు చేసిన వారిని బీసీసీఐ నియమించే క్రికెట్ కమిటీ ఇంటర్వ్యూ చేస్తుంది. ఒకవేళ రవిశాస్త్రి (59) పోటీలో లేకుంటే రాహుల్ ద్రవిడ్ ఎంపికవ్వడం లాంఛనమే! ఇప్పటికే ద్రవిడ్ అండర్-19, భారత్-ఏ కోచ్గా విజయవంతం అయ్యాడు. ఎన్సీఏ చీఫ్గా రిజర్వు బెంచిని పటిష్ఠంగా మార్చాడు. భారత జట్టులోని అందరితో అతడికి మంచి సంబంధాలు ఉన్నాయి. పైగా ఈ మధ్యే శ్రీలంకలో భారత జట్టుకు కోచ్గా పనిచేశాడు. తాజాగా ఎన్సీఏ చీఫ్ పదవికి బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించడం కూడా ద్రవిడ్ ఎంపిక తప్పదన్న సంకేతాలు ఇస్తోంది.