షార్జా : రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్లో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ, చెన్నై సారథి మహేంద్ర సింగ్ ధోనీ టాస్ వేసేందుకు షార్జా మైదానంలోకి వచ్చారు. అదే సమయంలో ఒక్కసారిగా ఇసుక తుపాను చెలరేగడం వల్ల అంపైర్లు టాస్ను కొంతసేపు ఆలస్యం చేశారు. దీంతో కోహ్లీ, ధోనీ.. సరదాగా కబుర్లు చెప్పుకొనేందుకు మంచి సమయం దొరికింది. ఈ క్రమంలోనే ఇద్దరు కెప్టెన్లు ముచ్చటించుకుంటున్న వీడియోను ఐపీఎల్ నిర్వహకులు ట్విటర్లో పోస్టు చేశారు. అది చూసిన టీమ్ఇండియా అభిమానులు సంతోషంతో లైకులు, కామెంట్లు చేస్తున్నారు. వారిద్దరినీ ఇలా చూడటం బాగుందని అంటున్నారు. అలాగే చాలా రోజుల తర్వాత కలిశారు కదా.. ఏం మాట్లాడుకుంటున్నారో అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే, రాబోయే టీ20 ప్రపంచకప్లో టీమ్ఇండియా గురించి చర్చించి ఉండొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. వచ్చేనెల యూఏఈలోనే జరిగే టీ20 ప్రపంచకప్లో ధోనీ టీమ్ఇండియా మెంటార్గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. అలాగే 14 పాయింట్లతో పట్టికలోనూ అగ్రస్థానంలోకి చేరింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన కోహ్లీ సేన 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులు చేసింది. ఓపెనర్లు దేవ్దత్ పడిక్కళ్ (70), కోహ్లీ (53) అర్ధసెంచరీలతో రాణించారు. బ్రావోకు మూడు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో చెన్నై 18.1 ఓవర్లలో 4 వికెట్లకు 157 పరుగులు చేసి గెలిచింది. టాప్-4 బ్యాటర్స్ గైక్వాడ్ (38), డుప్లెసి స్(31), రాయుడు (32), మొయిన్ అలీ (23) రాణించగా చివర్లో రైనా (17 నాటౌట్) మ్యాచ్ను ముగించాడు. హర్షల్కు రెండు వికెట్లు దక్కాయి. 3 వికెట్లు తీసిన బ్రావో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు.