హైదరాబాద్ : టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా సెంచరీ చేసి 1055 రోజులైంది. 2019 జనవరిలో ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్లో పుజారా (193 పరుగులు) ఆఖరిసారి సెంచరీ నమోదు చేశాడు. అప్పటినుంచి టీమిండియా ఆడిన 22 టెస్టుల్లో ఒక్క సెంచరీ కూడా చేయలేదు. తాజాగా నవంబర్ 25 నుంచి కివీస్ తొలి టెస్టు నేపథ్యంలో ఈసారి కచ్చితంగా సెంచరీ కొడతానని ధీమా వ్యక్తం చేశాడు. తొలి టెస్టు సందర్భంగా పుజారా మీడియాతో సుధీర్ఘంగా మాట్లాడాడు. ‘నా టెస్టు కెరీర్లో సెంచరీకి ఇంత సమయం తీసుకోవడం ఇదే తొలిసారి. ఈ మధ్యన ఆడిన మ్యాచ్ల్లో 50-60 పరుగులు సాధిస్తున్నాను. ఈసారి కచ్చితంగా సెంచరీ కొట్టేందుకు ప్రయత్నిస్తా. కివీస్తో టెస్టు సిరీస్ స్వదేశంలో ఆడనుండడం సానుకూలాంశం మారింది. పిచ్ పరిస్థితులు మనకు అనుకూలంగా ఉంటాయి. ఒక్క మంచి ఇన్నింగ్స్తో నిలబడితే చాలు. ఇక బ్యాటింగ్ టెక్నిక్లో పెద్దగా మార్పులు ఏం లేవు. ఇన్నింగ్స్ను భయంతో ఆడకూడదని నిర్ణయించుకున్నా. ఇక రహానే విషయంలోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. ప్రతీ ఆటగాడికి గడ్డుకాలం అనేది కచ్చితంగా ఉంటుంది. రహానే ఎంత గొప్ప ఆటగాడనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రహానే ఆటలో ప్రస్తుతం ఎత్తుపల్లాలు ఉన్నాయి. కానీ అతనిపై నాకు నమ్మకముంది. అతని కష్టపడే తత్వమే పరుగులు వచ్చేలా చేస్తాయి. రహానే ఫామ్లోకి రావడానికి ఒక్క ఇన్నింగ్స్ చాలు. ఒక్కసారి లయ అందుకున్నాడంటే వెనుదిరిగి చూడనవసరం లేదు.’’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక పుజారా 2019- 2021 మధ్య కాలంలో టెస్టులో 9 అర్థసెంచరీలు చేయగా.. అందులో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్పై టీమిండియా సిరీస్లు నెగ్గడం విశేషం. ఓవరాల్గా ఇప్పటివరకు పుజారా టీమిండియా తరపున 90 టెస్టుల్లో 6494 పరుగులు చేయగా.. ఇందులో 18 సెంచరీలు.. 31 అర్థసెంచరీలు ఉన్నాయి.