లండన్ : ఇంగ్లాండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్కు దిగిన కోహ్లీసేన మొదటిరోజు గురువారం మొదటి ఇన్నింగ్స్లో 191 పరుగులకు కుప్పకూలింది. కోహ్లీ, శార్దూల్ ఠాగూర్ మాత్రమే అర్ధ సెంచరీలు సాధించగా మిగతా వారంతా క్రీజులోకి రాక పోక అన్నరీతిలో వికెట్లు పారేసుకున్నారు. టీమిండియా ఆరంభంలోనే ఓపెనర్లు రోహిత్ శర్మ(11), రాహుల్(17)తో పాటు వన్డౌన్ బ్యాట్స్మన్ ఛతేశ్వర్ పుజారా (4)ను కోల్పోయింది. తొలుత వోక్స్ రోహిత్ను ఔట్చేసి ఇంగ్లాండ్కు శుభారంభం అందించగా కాసేపటికే రాహుల్, పుజారాను రాబిన్సన్, అండర్సన్ పెవిలియన్ పంపారు. దాంతో తొలి సెషన్ ముగిసేసరికి టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి 54 పరుగులు చేసింది. పుజారా ఔటయ్యాక రహానే స్థానంలో క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా కూడా క్రీజులో కుదురుకోలేక పోయాడు. 10 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 4, రాబిన్సన్ 3, ఆండర్సన్ 1, ఓవర్టన్ 1 వికెట్ చొప్పున పడగొట్టారు. కాగా, మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్కు బూమ్రా షాక్ ఇచ్చాడు. రోరి బర్న్స్ 5 పరుగులు చేయగా, హమీద్ డకౌట్ అయ్యాడు. కడపటి వార్తలు అందేసరికి ఇంగ్లాండ్ స్కోరు 6 పరుగులకు 2 వికెట్లు.