న్యూదిల్లీ : టీ20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే ప్రకటించిన 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టులోని అక్షర్ పటేల్ను స్టాండ్ బై ప్లేయర్గా డిమోషన్ చేసిన బీసీసీఐ స్టాండ్ బై ప్లేయర్గా ఉన్న శార్దూల్ ఠాకూర్కు తుది జట్టులో చోటు కల్పిస్తూ ప్రమోషన్ ఇచ్చింది. ఈ కీలక మార్పుతో పాటు మరో 8 మంది ఆటగాళ్లను జట్టుతో పాటే యూఏఈ బయోబబుల్లో ఉంచుతున్నట్లు బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం ట్విటర్ వేదికగా ఓ ప్రకటనను విడదల చేసింది. భారత టీ20 ప్రపంచకప్ జట్టు విషయంలో ఆలిండియా సెలెక్షన్ కమిటీ టీమ్ మేనేజ్మెంట్తో పలు చర్చలు జరిపిన తర్వాత కీలక నిర్ణయం తీసుకుంది. శార్దూల్ ఠాకూర్కు ప్రధాన జట్టులో చోటు కల్పించింది. ఇక 15 మంది సభ్యులతో కూడిన జట్టులో ఉన్న అక్షర్ పటేల్ను స్టాండ్ బై ప్లేయర్ జాబితాలో మార్చింది. టీమిండియా సన్నాహకాల్లో జట్టుకు అండగా ఉండేందుకు మరో 8 మంది ప్లేయర్లు భారత జట్టుతో దుబాయ్లోని బయోబబుల్లో ఉండనున్నారు’అని బీసీసీఐ ఆ ప్రకటనలో పేర్కొంది.సన్నాహకాల కోసం బీసీసీఐ కొత్తగా జత చేసిన 8 మంది ఆటగాళ్ల జాబితాలో దిల్లీ క్యాపిటల్స్ పేసర్ అవేష్ ఖాన్, సన్రైజర్స్ సెన్సేషన్ ఉమ్రాన్ మాలిక్, ఆర్సీబీ ప్లేయర్ హర్షల్ పటేల్, లుక్మాన్ మేరీవాలా, వెంకటేశ్ అయ్యర్, కరణ్ శర్మ, షాబాజ్ అహ్మద్, కృష్ణప్ప గౌతమ్లు ఉన్నారు. వీరంతా టీమిండియాతో పాటే యూఏఈ బబుల్లో ఉండనున్నారు. అయితే నిలకడలేమి ఫామ్తో సతమతమవుతున్న హార్దిక్ పాండ్యాపై వేటు వేస్తారని అంతా భావించినా.. బీసీసీఐ అతని విషయాన్నే ప్రస్తావించలేదు. అతని ఫిట్నెస్ విషయంపై కూడా ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. అంతేకాకుండా ఐపీఎల్లో విఫలమైన భువనేశ్వర్ కుమార్ గురించి కూడా ఏం చెప్పలేదు.
అందుకే అక్షర్ను తప్పించారా?
ఐపీఎల్ 2021 సీజన్ సెకండాఫ్లో దారుణంగా విఫలమైన హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్లను జట్టు నుంచి తప్పిస్తారని అంతా భావించినా.. బీసీసీఐ మాత్రం ఆశ్చర్యకరంగా అక్షర్పై వేటు వేసింది. అయితే జట్టులో స్పిన్నర్లు ఎక్కువగా ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పైగా ఐపీఎల్ 2021 సీజన్లో అక్షర్ పెర్ఫామెన్స్ ఏం ఆశజనకంగా లేదు. 11 మ్యాచ్లు ఆడిన అక్షర్ బౌలింగ్లో 15 వికెట్లు తీసినప్పటికీ బ్యాటింగ్లో పెద్దగా రాణించలేదు. లోయరార్డర్లో బ్యాటింగ్కు వచ్చి కేవలం 36 పరుగులే చేశాడు. ఈ క్రమంలోనే అతన్ని స్టాండ్బై ప్లేయర్గా డిమోట్ చేసినట్లు తెలుస్తోంది. పైగా పేసర్లకు బ్యాకప్గా శార్దూల్ను తీసుకున్నట్లు తెలుస్తోంది. పైగా అతని సీఎస్కేలో వికెట్ టేకర్గా రాణిస్తున్నాడు. బ్యాటింగ్ చేసే సామర్థ్యం కూడా అతని సొంతం.
పాక్తో ఫస్ట్ మ్యాచ్…
అక్టోబర్ 17న ఓమన్ వేదికగా క్వాలిఫైర్ మ్యాచులు ప్రారంభం కానుండగా.. అక్టోబర్ 23 నుంచి సూపర్ 12 స్టేజ్ ఆరంభం అవుతుంది. పొట్టి ప్రపంచకప్లో భాగంగా అబుదాబిలో జరగబోయే తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు తలపడతాయి. గ్రూప్`2లో భాగంగా అక్టోబర్ 24న భారత్, పాకిస్థాన్ మధ్య దుబాయ్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. పాకిస్థాన్తో మ్యాచ్ అనంతరం అక్టోబర్ 31న న్యూజిలాండ్తో, నవంబర్ 3న అఫ్గ్గానిస్థాన్తో భారత్ ఆడనుంది. ఆ తర్వాత క్వాలిఫయర్లో గెలిచిన జట్లతో మరో రెండు మ్యాచులు కోహ్లిసేన తలపడనుంది. ఈ రెండు మ్యాచులు నవంబర్ 5, 8 తేదీల్లో జరగనున్నాయి. పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లను భారత్ ఓడిస్తే.. సునాయాసంగా తదుపరి రౌండ్ చేరుకుంటుంది.