న్యూదిల్లీ: బీసీసీఐ అధ్యక్షుడిగా రెండేళ్ల పాటు బాధ్యతలు నిర్వహించిన సౌరవ్ గంగూలీ, తిరిగి ఐపీఎల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దిల్లీ క్యాపిటల్స్ టీమ్కి డైరెక్టర్గా బాధ్యతలు తీసుకోబోతున్నాడు. గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడు కావడానికి ముందు దిల్లీ క్యాపిటల్స్ టీమ్కి హెడ్ కోచ్గా, మెంటార్గా వ్యవహరించాడు. ఐపీఎల్లో దిల్లీ క్యాపిటల్స్ జట్టుతో పాటు ఐఎల్ టీ20 (ఇంటర్నేషనల్ లీగ్ టీ20) దుబాయ్ క్యాపిటల్స్, అలాగే సౌతాఫ్రికా టీ20 లీగ్లో ప్రెటోరియా క్యాపిటల్స్ టీమ్కి కూడా గంగూలీ డైరెక్టర్గా వ్యవహరించబోతున్నాడు. ‘అవును, సౌరవ్ గంగూలీ తిరిగి దిల్లీ క్యాపిటల్స్లోకి రాబోతున్నారు. ఆయనతో జరుపుతున్న చర్చలు తుదిదశకు చేరుకున్నాయి. త్వరలో అధికారిక ప్రకటన వస్తుంది. దిల్లీ క్యాపిటల్స్ టీమ్తో ఆయన పనిచేశారు, ఈ ఫ్రాంఛైజీతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. అందుకే ఆయన్ని ఒప్పించాం’ అని దిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం దిల్లీ క్యాపిటల్స్ టీమ్ ముందున్న ప్రధాన సమస్య రిషబ్ పంత్ స్థానంలో కొత్త కెప్టెన్ని ఎంపిక చేయడం. గత రెండు సీజన్లలో దిల్లీ క్యాపిటల్స్కి కెప్టెన్గా వ్యవహరించిన రిషబ్ పంత్, కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతను కోలుకోవడానికి కనీసం 6 నెలల సమయం పడుతుందని సమాచారం. రిషబ్ పంత్ స్థానంలో డేవిడ్ వార్నర్కి కెప్టెన్సీ అప్పగిస్తారా? లేక అండర్19 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ పృథ్వీ షాకి కెప్టెన్సీ పగ్గాలు ఇస్తారా? అనేది ఆసక్తిగా మారింది. ఇప్పుడు దిల్లీక్యాపిటల్స్ తర్వాతి కోచ్ని నిర్ణయించే బాధ్యత సౌరవ్ గంగూలీపైనే పడిరది.