చెన్నై: చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ విజయాల బాట పట్టింది. బౌలింగ్లోనూ, బ్యాటింగ్లోనూ సమష్టిగా రాణించి ముంబై ఇండియన్స్పై అద్భుత విజయం సాధించింది. సొంత మైదానంలో జరిగిన ఈ మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత చెన్నై బౌలర్ల ధాటికి ముంబై 8 వికెట్లు కోల్పోయి 139 పరుగులకే పరిమితమైంది. ఈ స్వల్ప లక్ష్యాన్ని చెన్నై 17.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. డేవాన్ కాన్వే (44, 42 బంతుల్లో 4 ఫోర్లు), రుతురాజ్ గైక్వాడ్ (30, 16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. అజింక్య రహానె 21, అంబటి రాయుడు 12 పరుగులు చేశారు. శివమ్ దూబె (25, 17 బంతుల్లో 3 సిక్స్లు), ధోని (2, 3 బంతులు )నాటౌట్గా నిలిచాడు. ముంబై బౌలర్లలో పీయూష్ చావ్లా రెండు, ట్రిస్టన్ స్టబ్స్, ఆకాష్ మద్వాల్ చెరో వికెట్ పడగొట్టారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై బ్యాటర్లలో నేహల్ వధేరా (64, 51 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకంతో రాణించాడు. సూర్యకుమార్ యాదవ్ 26, ట్రిస్టన్ స్టబ్స్ 20 పరుగులు చేశారు. కామెరూన్ గ్రీన్ (6), ఇషాన్ కిషన్ (7), రోహిత్ శర్మ (0) విఫలమవడంతో ముంబై 14 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిరది. తర్వాత క్రీజులోకి వచ్చిన నేహల్ వధేరా, సూర్యకుమార్ యాదవ్ నిలకడగా ఆడి ఇన్నింగ్స్ను గాడిలో పెట్టారు. చివర్లో మెరుపులు మెరిపిస్తాడనుకున్న టిమ్ డేవిడ్ (2) సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యాడు. చెన్నై బౌలర్లలో పతిరాణా (3/15), దీపక్ చాహర్ (2/18) ఆకట్టుకున్నారు. తుషార్ దేశ్పాండే 2, జడేజా ఒక వికెట్ పడగొట్టారు.