దుబాయ్ : మహేంద్ర సింగ్ ధోనీ అత్యుత్తమ కెప్టెన్ అని శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ ప్రశంసలు కురిపించాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ధోనీతో కలిసి ఆడిన అనుభవాలను గుర్తు చేసుకున్నాడు. ‘చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చాలా బాగుంది. ఐపీఎల్ ఆరంభ సీజన్(2008) గురించి మాట్లాడుకుంటే.. టోర్నీలో చాలా సార్లు 200 పరుగుల మార్కును దాటి, ఎక్కువ వికెట్లు తీశారు. కెప్టెన్గా ధోనీ చాలా బాగా పనిచేశాడు. అప్పుడు జట్టులో ఉన్న చాలా మంది ఆటగాళ్లు వారి జాతీయ జట్లలో దిగ్గజ క్రికెటర్లు. ధోనీ ప్రతి ఆటగాడిని అర్థం చేసుకుంటాడు. బలమైన జట్టుని నిర్మించాడు. ఐపీఎల్ను ఆస్వాదించా. ప్రధానంగా నేను వికెట్ల కోసం కాకుండా పరుగులు కట్టడి చేయడానికే ప్రయత్నించా. ఈ క్రమంలోనే వికెట్లు తీశా’ అని మురళీధరన్ అన్నాడు. ఐపీఎల్-13 సీజన్ రెండో దశ యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి ప్రారంభం కానుంది. డిఫెండిరగ్ చాంపియన్ ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే చాలామంది ఆటగాళ్లు అక్కడికి చేరుకున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ ధోనీ సారథ్యంలో ఇప్పటికే మూడు సార్లు ఐపీఎల్ విజేతగా, ఐదుసార్లు రన్నరప్గా నిలిచింది.