దుబాయ్ : టీ20 ప్రపంచకప్ 2021లో భాగంగా జరిగిన సన్నాహక మ్యాచ్ల్లో టీమిండియా అదరగొట్టిన విషయం తెలిసిందే. రెండు పటిష్ట జట్లపై సంపూర్ణ విజయం సాధించింది. ముందుగా ఇంగ్లండ్ను చిత్తుచేసిన భారత్.. ఆపై ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. ఇంగ్లండ్తో సోమవారం జరిగిన వామప్ మ్యాచ్లో బ్యాటింగ్లో దుమ్మురేపిన భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది. బ్యాటింగ్కు అనుకూలమైన పిచ్పై కేఎల్ రాహుల్ (24 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 51), ఇషాన్ కిషన్ (46 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లతో 70) హాఫ్ సెంచరీలు చేశారు. ఇక బుధవారం ఆసీస్ నిర్ధేశించిన 153 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఒక వికెట్ మాత్రమే కోల్పోయి మరో 13 బంతులు ఉండగానే ఛేదించింది. ఓపెనర్ రోహిత్ శర్మ (41 బంతుల్లో ఐదు ఫోర్లు, మూడు సిక్స్లతో 60) హాఫ్ సెంచరీ బాదాడు. అయితే ఆస్ట్రేలియాతో దుబాయ్ వేదికగా టీమిండియా రెండో వార్మప్ మ్యాచ్ ఆడగా.. ఈ మ్యాచ్లో చోటుచేసుకున్న ఓ దృశ్యం క్రికెట్ అభిమానులను తెగ ఆకట్టుకుంది. ఒకవైపు మ్యాచ్ జరుగుతుండగా.. మరోవైపు బౌండరీ లైన్కి వెలుపల టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్కి భారత జట్టు మెంటార్ ఎంఎస్ ధోనీ కీపింగ్ స్కిల్స్ నేర్పుతూ కనిపించాడు. ఆ సమయంలో మ్యాచ్ వికెట్ కీపర్గా ఇషాన్ కిషన్ వ్యవహరించాడు. టీ20 ప్రపంచకప్లో టీమిండియాకి ఎంఎస్ ధోనీ మెంటార్గా ఉన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ 2021 అనంతరం మహీ భారత జట్టు కోసం యూఏఈలోనే ఉన్నాడు. ఇప్పటికే టీమ్లోని కొంత మంది ఆటగాళ్లకి ఎంఎస్ ధోనీ బ్యాటింగ్ క్లాస్లు తీసుకున్నాడట. ఇక పాకిస్థాన్తో కీలక మ్యాచ్ నేపథ్యంలో తాజాగా రిషబ్ పంత్పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. పంత్ పక్కన కూర్చుని తొలుత కాసేపు క్లాస్ తీసుకున్న ధోనీ.. ఆ తర్వాత కీపింగ్ టెక్నిక్స్ని ప్రాక్టికల్గా నేర్పించాడు. వికెట్ల వెనకాల ఎలా ఉండాలో, బంతిని ఎలా తీసుకోవాలో అని క్లాసులు తీసుకున్నాడు. స్వయంగా వికెట్లకు బంతులు విసురుతూ పంత్తో ప్రాక్టీస్ చేయించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అయింది. అది చూసిన ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘టీమిండియా తర్వాతి కోచ్ ఎంఎస్ ధోనీనే ఇక’ అని కామెంట్లు చేస్తున్నారు.