న్యూదిల్లీ : టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా భారత్-పాక్ జట్ల మధ్య ఈ నెల 24న జరగనున్న హై ఓల్టేజ్ పోరు నేపథ్యంలో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కశ్మీర్లో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా భారత్-పాక్ మ్యాచ్ను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడుతూ అమాయక ప్రజల ప్రాణాలు తీస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో దాయాదుల పోరు జరగడం వల్ల ఉద్రిక్తతలు మరింత పెరిగే ఆస్కారముందని అభిప్రాయపడ్డాడు. కాగా, దక్షిణ కశ్మీర్లోని కుల్గాం జిల్లాలో ముష్కరులు కాల్పులకు తెగబడి ఇద్దరిని పొట్టనబెట్టుకున్నారు. ఈ నెలలో ఇప్పటి దాకా ఉగ్రదాడులకు 11 మంది బలయ్యారు. ఈ నేపథ్యంలోనే పాక్పై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. టీ20 ప్రపంచకప్లో పాక్తో మ్యాచ్ను బాయ్కాట్ చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.