హైదరాబాద్: టీమిండియా వెటరన్ బ్యాటర్, ఆంధ్ర కెప్టెన్ హనుమ విహారిపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ 2023లో భాగంగా మధ్యప్రదేశ్తో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్లో విహారి.. ఫ్రాక్చర్ మణికట్టుతో బ్యాటింగ్ చేశాడు. రైట్ హ్యాండ్ బ్యాటర్ అయిన విహారి ఎడమచేతి మణికట్టు విరగడంతో లెఫ్టాండ్ బ్యాటింగ్ చేశాడు. దాంతో అతని పోరాటపటిమను అందరూ ప్రశంసిస్తున్నారు. ఇండోర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో ఆంధ్ర జట్టు ముందు బ్యాటింగ్ చేయగా.. మధ్యప్రదేశ్ బౌలర్ అవేశ్ ఖాన్ బౌలింగ్లో హనుమ విహారి గాయపడ్డాడు. అతను విసిరిన బౌన్సర్ హనుమ విహారి ఎడమ చేతి మణికట్టుకు బలంగా తగలడంతో అతను రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు.
ఒంటి చేత్తో బ్యాటింగ్..
అయితే 323/2తో పటిష్టంగా కనిపించిన ఆంధ్ర, 30 పరుగుల వ్యవధిలోనే 7 వికెట్లు కోల్పోయింది. దాంతో విరిగిన చేతితోనే విహారి ఆఖరి వికెట్గా మళ్లీ బ్యాటింగ్కు వచ్చాడు. లెఫ్టాండ్ బ్యాటింగ్ చేస్తూ 20 బంతులాడి ఒంటి చేత్తోనే రెండు బౌండరీలూ బాదాడు. ముందు రోజు స్కోరుకు 11 పరుగులు జోడిరచిన తరువాత ఔటయ్యాడు. ఇక విహారి మణికట్టులో చీలిక వచ్చిందని, గాయం నుంచి కోలుకునేందుకు 5-6 వారాల టైమ్ పడుతుందని వైద్యులు సూచించినట్లు ఆంధ్ర జట్టు వర్గాలు పేర్కొన్నాయి. సీరియస్ ఇంజ్యూరీఅయిన విహారి జట్టు కోసం రిస్క్ చేశాడు.
డాక్టర్లు, ఫిజియో వద్దన్నా..
తాజాగా దీనిపై స్పందించిన హానుమ విహారి.. జట్టులో గెలవాలనే కసిని పెంచడానికి తాను రిస్క్ చేసి బ్యాటింగ్ చేసినట్లు తెలిపాడు. ‘నా ఎడమ చేతి మణికట్టు విరిగింది. డాక్టర్లు బ్యాటింగ్ చేయవద్దని సూచించారు. మా టీమ్ ఫిజియో కూడా బ్యాటింగ్ చేయడం కుదరదని చెప్పాడు. కానీ వికెట్లు పడిపోతున్నప్పుడు, ఒంటి చేత్తో లెఫ్టాండ్ బ్యాటింగ్ ఎందుకు చేయకూడదు? అనే ఆలోచన నాకు వచ్చింది.
టీమ్ స్పిరిట్ పెంచేందుకే..
10-15 బంతులాడి.. మరో 10 పరుగులు చేసినా గొప్పవిషయమే అనిపించింది. అంతేకాకుండా విజయం కోసం పోరాడాలనే తన ఉద్దేశం టీమ్కు అర్థమవుతుందనిపించింది. నేను వదిలేస్తే టీమ్లో నిరాశ నెలకొంటుంది. నేను పరుగులు చేయకున్నా.. తొలి బంతికే ఔటైనా.. గాయంతో బ్యాటింగ్కు సిద్దమయ్యాననే స్పూర్తి మా ఆటగాళ్లకు కలుగుతోంది. టీమ్ స్పిరిట్ పెంచేందుకు ఓ ఉదాహరణగా నిలవాలనే ఈ రిస్క్ చేశాను. ఈ ఫస్ట్ ఇన్నింగ్స్తోనే మ్యాచ్ ఫలితం తేలుతుందని అనుకోవడం లేదు. ఇది ఐదు రోజుల గేమ్. ప్రతీ సెషన్ ముఖ్యమే.
మా గేమ్ ప్లాన్ అదే..
వీలైనంత త్వరగా ప్రత్యర్థి కట్టడి చేసి రెండో ఇన్నింగ్స్లో మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సి ఉంది. అసాధారణ బ్యాటింగ్తో భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచితే విజయం సాధించవచ్చు. అదే మా గేమ్ ప్లాన్. ఫస్ట్ ఇన్నింగ్స్లో లభించే లీడ్తో ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించకూడదు.’అని హనుమ విహారి చెప్పుకొచ్చాడు. ఇక మధ్య ప్రదేశ్ను 228 పరుగులకు ఆలౌట్ చేసిన ఆంధ్ర.. 151 పరుగుల భారీ ఆధిక్యాన్ని అందుకుంది. కానీ రెండో ఇన్నింగ్స్లో 40 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది.