Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ముంబై జట్టులో రాణిస్తున్న హైదరాబాదీ క్రికెటర్‌

దిల్లీ: ఐపీఎల్‌ 2023లో ముంబై ఇండియన్స్‌ వరుస పరాజయాలు ఎదుర్కొంటోంది. అయితే ఒక్క ఆటగాడు మాత్రం ముంబై తరపున నిలకడగా రాణిస్తున్నాడు. సూపర్‌ స్ట్రైక్‌ రేట్‌తో సునామీ ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. అతనెవరో కాదు.. హైదరా బాదీ క్రికెటర్‌ తిలక్‌ వర్మ. మంగళవారం అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ దుమ్ము రేపాడు తిలక్‌. సూపర్‌ ఇన్నింగ్స్‌తో ఈ సీజన్‌లో ముంబైకు మొదటి విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 29 బంతులు ఎదుర్కొన్న ఈ యంగ్‌ బ్యాటర్‌ 41 పరుగులు చేశాడు. ఇందులో ఒక ఫోర్‌, 4 సిక్స్‌లు ఉండడం గమనార్హం. ముఖ్యంగా ముఖేష్‌ కుమార్‌ వేసిన 16వ ఓవర్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు తిలక్‌. వరుసగా ఫోర్‌, రెండు సిక్స్‌లు బాది గెలుపును ముంబైకు మరింత చేరువ చేశాడు. అంతకు ముందు బెంగళూరుతో జరిగిన మొదటి మ్యాచ్‌లో తిలక్‌ ఆడిన ఇన్నింగ్స్‌ను అంత ఈజీగా మర్చిపోలేం. ఆ మ్యాచ్‌లో కేవలం 46 బంతులు ఎదుర్కొన్న వర్మ 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 84 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మొత్తానికి ఈ సీజన్‌లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన ఈ హైదరాబాదీ క్రికెటర్‌…147 పరుగులు చేశాడు. టోర్నీలో ముంబై తరపున టాప్‌స్కోరర్‌గా వర్మనే కొనసాగుతున్నాడు. మొత్తానికి ఐపీఎల్‌లో దుమ్మురేపుతున్న తిలక్‌ వర్మపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. మాజీ క్రికెటర్లు తిలక్‌ బ్యాటింగ్‌కు ముగ్ధులవుతున్నారు. ‘ఎలాంటి పిచ్‌పై నైనా చెలరేగే సత్తా తిలక్‌కు ఉంది. అతను ముంబైకి దొరికిన విలువైన ఆస్తి’ అని ప్రముఖ కామెంటేటర్‌ హర్షా బోగ్లే తిలక్‌ను అభినందించారు. ‘త్వరలోనే తిలక్‌ను భారత జట్టులో చూడాలనుకుంటున్నాం.. మిడిల్‌ ఆర్డర్‌లో రాణించే సత్తా వర్మకు ఉంది’ అంటూ క్రికెట్‌ ఫ్యాన్స్‌ నెట్టింట పోస్టులు షేర్‌ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img