మెల్బోర్న్: మరికొద్ది రోజుల్లో యాషెస్ టెస్టు సిరీస్ మొదలుకానుంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఈ సిరీస్ ఆరంభానికి ముందే రెండు జట్ల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఆసీస్ సీనియర్ స్పిన్నర్ నాథన్ లియోన్ ఈ సిరీస్ ఫలితంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐదు టెస్టుల యాషెస్ సిరీస్ను ఆస్ట్రేలియా గెలుస్తుందని, ఇంగ్లండ్కు తమ చేతిలో వైట్వాష్ తప్పదని అతను అన్నాడు. ‘యాషెస్ టెస్టు సిరీస్ను మేము 5-0తో గెలుస్తామని వంద శాతం నమ్ముతున్నా. మేము చేయాల్సింది ఒక్కటే.. అక్కడకు వెళ్లి అద్భుతంగా ఆడడం. ఆ దేశ అభిమానుల నోళ్లకు తాళం వేయడం’ అని లియోన్ అన్నాడు. తమ జట్టు ప్రస్తుత ప్రదర్శన పట్ల అతను సంతోషం వ్యక్తం చేశాడు. 24 నెలలుగా మా జట్టు ఆట తీరు ఎంతో బాగుందన్నాడు. 2021-22 మధ్య జరిగిన యాషెస్ టెస్టులో అతిథ్య ఆస్ట్రేలియా 4-0తో ఇంగ్లండ్ను చిత్తు చేసింది. ప్యాట్ కమిన్స్ సేన ఈసారి కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేయాలనే పట్టులదలతో ఉంది. అయితే… ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని ఇంగ్లండ్ భావిస్తోంది.