రాంచీ : మూడు టీ20ల సిరీస్లో భాగంగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన రెండో టీ20 ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి గట్టి షాక్ తగిలింది. ఈ మ్యాచ్ను వాయిదా వేయాలంటూ జార్ఖండ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. రాంచీ వేదికగా శుక్రవారం(నవంబర్ 19)న రాత్రి 7.30కు ఈ మ్యాచ్ ప్రారంభంకావాల్సి ఉంది. ఈ మ్యాచ్కు 100 శాతం ప్రేక్షకులను అనుమతిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ న్యాయవాది ధీరజ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ వేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ భయంతో ఇంకా పాఠశాలలు మూసే ఉన్నాయని.. వైరస్ భయం వల్ల విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారని ధీరజ్ తన పిటిషన్ పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో తమ దగ్గర జరిగే క్రికెట్ మ్యాచ్కు 100 శాతం మంది వీక్షకులను ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. మ్యాచ్ను వాయిదా వేయడం లేదా 50 శాతం మంది వీక్షకులనే అనుమతిస్తూ నిర్ణయం తీసుకునేలా నిర్వాహకులను ఆదేశించాలని ధీరజ్ కుమార్ హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం 50 శాతం ప్రేక్షకులనే అనుమతిచ్చిందని పేర్కొన్నారు.