కోల్కతా : భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ క్రికెట్ జట్టు.. ఇంకా బోణీ కొట్టట్లేదు. టీమిండియాతో ఇప్పటికే టీ20 సిరీస్ను కోల్పోయింది. తొలి రెండు మ్యాచ్ల్లో ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఇంకో మ్యాచ్ మిగిలివుండగానే రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా.. సిరీస్ను సొంతం చేసుకుంది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా అందుకున్న తొలి టీ20 సిరీస్ ఇది. టీ20 ఫార్మట్ కెప్టెన్గా హిట్మ్యాన్కు ఇదే తొలి సిరీస్. దాన్ని విజయంతో ముగించాలని ఉవ్విళ్లూరుతున్నాడు.
ఈడెన్ గార్డెన్లో వైట్ వాష్
మూడు మ్యాచ్ల సిరీస్ను రోహిత్ సేన గెలు చుకుంది. మూడో మ్యాచ్ కోసం సమాయాత్తమౌతోంది. ఈ సిరీస్లో చివరిదైన ఈ మ్యాచ్ ఆదివారం సాయంత్రం 7 గంటలకు మొదలవుతుంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ దీనికి వేదిక కానుంది. ఇప్పుడున్న ఫామ్ చూస్తోంటే.. కివీస్పై కనికరం లేకుండా మిగిలిన ఆ ఒక్క మ్యాచ్ను కూడా టీమిండియా గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. న్యూజిలాండ్కు వైట్ వాష్ తప్పకపోవచ్చు.
ప్రయోగాలకు సిద్ధం..
సిరీస్ భారత్ కైవసం కావడంతో మూడో మ్యాచ్లో ప్రయోగాలకు సిద్ధపడుతోంది టీమిండియా. కొత్త కోచ్ రాహుల్ ద్రవిడ్.. తనదైన శైలిలో జట్టులో ప్రయోగాలకు రంగం సిద్ధం చేశాడు. ఈ నెల 25వ తేదీ నుంచి ఆరంభం కానున్న టెస్ట్ సిరీస్ కోసం సీనియర్లకు విశ్రాంతి ఇవ్వనున్నాడు. వారి స్థానంలో కొత్త ముఖాలకు అవకాశం కల్పించనున్నాడు. యువరక్తాన్ని జట్టులో నింపనున్నాడు. ఏకంగా నాలుగు మార్పులు చోటు చేసుకోవడానికి అవకాశం ఉంది.
రుతురాజ్కు ఛాన్స్..
ప్రయోగాలు చేయడం వైపే రాహుల్ ద్రవిడ్ మొగ్గు చూపిన నేపథ్యంలో- రోహిత్ శర్మ కోసం కొత్త ఓపెనింగ్ పార్ట్నర్ దొరికినట్టే. రుతురాజ్ గైక్వాడ్ను ఆడిరచే అవకాశాలు లేకపోలేదు. చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ 2021 సీజన్లో టన్నుల కొద్దీ పరుగులను బాది పడేసిన రుతురాజ్ గైక్వాడ్కు ఇదే తొలి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ అవుతుంది. న్యూజిలాండ్తో సాగుతున్న తొలి రెండు మ్యాచ్లల్లో రోహిత్ శర్మతో కలిసి కేఎల్ రాహుల్.. ఇన్నింగ్ను ఆరంభించాడు. టెస్టుల కోసం అతనికి విశ్రాంతి ఇవ్వాలని మేనేజ్మెంట్ నిర్ణయించింది.
ఇషాన్ కిషన్.. ఎంట్రీ
ఐపీఎల్తో వెలుగులోకి వచ్చిన మరో స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కూడా కోల్కత ఈడెన్ గార్డెన్ మ్యాచ్లో ఆడే అవకాశం ఉంది. రిషభ్ పంత్కు విశ్రాంతిని ఇచ్చి, అతని స్థానంలో ఇషాన్ను తీసుకోవాలని కోచ్ రాహుల్ ద్రవిడ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. రిషభ్ పంత్..ఇదే న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్ను ఆడాల్సి ఉంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మొదలైనప్పటి నుంచి విరామం లేకుండా క్రికెట్ ఆడుతోన్న రిషభ్కు విశ్రాంతి ఇచ్చి.. ఇషాన్ కిషన్ను తుదిజట్టులోకి తీసుకోవచ్చు.
అవేష్ ఖాన్కూ చోటు..
ఇదే లైన్లో ఫాస్ట్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్ లేదా దీపక్ చాహర్లల్లో ఒకరికి విశ్రాంతి ఇచ్చి- అవేష్ ఖాన్ను తుదిజట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. అవేష్ ఖాన్ కూడా ఐపీఎల్తో లైమ్లైట్లోకి వచ్చిన క్రికెటరే. అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్లకు బదులుగా సీనియర్ స్పిన్నర్ యజువేందర్ చాహల్ను జట్టులో చోటు కల్పిస్తారని అంటున్నారు. ఇలా భారీ మార్పులకు కోచ్ రాహుల్ ద్రవిడ్ సన్నద్దం అయ్యారని తెలుస్తోంది.