కొలంబో : శ్రీలంక క్రికెట్ జట్టుతో ఆదివారం జరిగిన తొలి టీ20 మ్యాచ్లో విజయం సాధించడంపై కెప్టెన్ శిఖర్ థావన్ సంతోషం వెలిబుచ్చాడు. ఈ మ్యాచ్లో అర్ధ సెంచరీతో అదరగొట్టిన సూర్యకుమార్ బ్యాటింగ్ అద్భుతమని ప్రశంసించాడు. ‘‘మేం 10-15 పరుగులు తక్కువ చేశాం. తొలి బంతికే వికెట్ కోల్పోయినప్పటికీ తర్వాత బాగా ఆడాం. సూర్య గొప్ప ఆటగాడు. అతడి బ్యాటింగ్ శైలిని బాగా ఆస్వాదించాను. నాపై ఒత్తిడి లేకుండా చేశాడు. అతడు ఆడిన షాట్స్ అద్భుతం’’ అని థావన్ మెచ్చుకున్నాడు. స్పిన్నర్లు చాహల్, వరుణ్ చక్రవర్తి, కృనాల్పాండ్య బాగా ఆడారని థావన్ చెప్పాడు. ‘‘వాళ్లు బాగా ఆడుతున్నారు. స్పిన్నర్లు బాగా రాణిస్తారని తెలుసు. భువీ బౌలింగ్ బాగా చేశాడు. కృనాల్ కూడా. అరంగేట్ర మ్యాచ్లోనే వరుణ్ తక్కువ పరుగులు ఇచ్చి వికెట్ తీశాడు. అతడి బౌలింగ్ను ఎదుర్కోవడం కష్టం. పృథ్వీ షా అద్భుతమైన ఆటగాడు. ఈ మ్యాచ్లో విఫలమైనప్పటికీ.. తిరిగి పుంజుకుంటాడు’’ అని థావన్ చెప్పాడు. ప్రేమదాస స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన తొలి టీ20 మ్యాచ్లో టీమిండియా 38 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత బౌలర్లు సమష్టిగా రాణించారు. భువనేశ్వర్ 4 వికెట్లు, దీపక్ చాహర్ 2 వికెట్లు తీశారు. దీంతో మూడు మ్యాచ్ల థావన్ సేన 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
టెస్టు జట్టులో పృథ్వీషా, సూర్యకుమార్
లండన్: ఇంగ్లండ్తో జరగనున్న ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్కు ఆడే భారతజట్టులో ఓపెనర్ పృథ్వీషా, సూర్యకుమార్ యాదవ్లకు చోటు దక్కింది. బీసీసీఐ సోమవారం జట్టులో వీరిద్దరి పేర్లను చేర్చింది. గాయపడిన శుభ్మన్ గిల్, వాషింగ్టన్ సుందర్, అవేష్ ఖాన్ల స్థానంలో వీరిని జట్టులోకి తీసుకుంది. ప్రస్తుతం వీరిద్దరూ శ్రీలంకలో ఉన్నారు. థావన్ సారథ్యంలోని భారత యువజట్టు ప్రస్తుతం శ్రీలంకలో పర్యటిస్తోంది. వన్డే సిరీస్ను భారత జట్టు గెలుచుకోగా, ఆదివారం టీ20 సిరీస్ ప్రారంభమైంది. తొలి మ్యాచ్లో లో సూర్యకుమార్ యాదవ్ అర్థ సెంచరీతో అదరగొట్టాడు.
భారత జట్టు: రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానే (వైస్ కెప్టెన్), హనుమ విహారి, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ఆర్.అశ్విన్, రవీంద్ర జడేజా, అక్సర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమీ, సిరాజ్, శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), అభిమన్యు ఈశ్వరన్, పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్.