ముగిసిన జూనియర్ అథ్లెటిక్స్
ఒక రజతం, 2 కాంస్య పతకాలు
నైరోబి: ఒకే ఒక సెంటిమీటర్ దూరం భారత అథ్లెట్ శైలీ సింగ్ను స్వర్ణానికి దూరం చేసింది. ప్రపంచ జూనియర్ అథ్లెటిక్స్ (అండర్-20) చాంపియన్షిప్లో ఆమె రజతం గెలిచినా… వెంట్రుకవాసిలో పసిడి దక్కకపోవడమనేది అథ్లెట్ను బాగా నిరాశపరిచే అంశం. కెన్యా రాజధానిలో ఆదివారం ముగిసిన ఈ జూనియర్ మెగా ఈవెంట్లో లాంగ్జంపర్ శైలీ ఆదివారం ఫైనల్స్లో అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన కనబరిచింది. మొత్తం 12 మంది పోటీపడిన మహిళల లాంగ్జంప్ ఫైనల్లో స్వీడన్కు చెందిన మజ అస్కగ్ 6.60 మీటర్ల దూరం దూకి బంగారు పతకం సాధించింది. భారత లాంగ్జంపర్ శైలీ కూడా తానేం తక్కువ కాదని 6.59 మీటర్ల దూరం దూకింది. అర అంగుళం కంటే తక్కువ తేడాతో బంగారాన్ని కోల్పోయింది. తొలి, రెండో ప్రయత్నంలో ఆమె 6.34 మీ. దూరాన్ని నమోదు చేసింది. రెండో ప్రయత్నం ముగిసే సరికి హోరియెలొవా (6.50 మీ.బీ ఉక్రెయిన్) ఆధిక్యంలో నిలువగా, ఎబొసెలె (6.46మీ.బీ స్పెయిన్), శైలీ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. మూడో ప్రయత్నం (6.59 మీ.) శైలీని స్వర్ణావకాశానికి దగ్గర చేసింది. అప్పటికి అస్కగ్ (6.44 మీ.) పతకం బరిలోకి రానేలేదు. కానీ నాలుగో ప్రయత్నం అస్కగ్ (6.60 మీ.)ను చాంపియన్గా చేస్తే, భారత అథ్లెట్ 4, 5 ప్రయత్నాలు ఫౌల్ అయ్యాయి. ఆఖరి ఆరో ప్రయత్నం సఫలమైనా… 6.37 మీటర్ల దూరమే దూకింది. దీంతో చివరకు రజతమే ఖాయమైంది. ఉక్రెయిన్ అథ్లెట్ మరియా హోరియెలొవా (6.50 మీ.) కాంస్యం గెలిచింది.
మహిళల రిలేలో నాలుగో స్థానం
తెలుగమ్మాయి కుంజా రజిత భాగంగా ఉన్న 4I400 మీటర్ల రిలేలో భారత జట్టుకు నాలుగో స్థానం దక్కింది. మహిళల ఫైనల్లో రజిత, ప్రియా మోహన్, పాయల్ వోహ్రా, సమ్మీలతో కూడిన జట్టు పోటీని 3 నిమిషాల 40.45 సెకన్లలో పూర్తి చేసింది. ఇందులో నైజీరియా అమ్మాయిలు 3 ని.31.46 సెకన్ల టైమింగ్తో విజేతగా నిలిస్తే, జమైకా జట్టు (3ని.36.57 సె.) రజతం, ఇటలీ బృందం (3ని.37.18 సె.) కాంస్యం గెలుపొందింది. పురుషుల ట్రిపుల్ జంప్లో స్వల్పతేడాతో భారత అథ్లెట్ డొనాల్డ్ మకిమయిరాజ్ (15.82 మీ.) కాంస్య పతకం కోల్పోయాడు. ఇతని కంటే మూడు సె.మీ.దూరం దూకిన సైమన్ గోర్ (15.85 మీ.బీ ఫ్రాన్స్)కు కాంస్యం లభించగా, మకిమయిరాజ్కు నాలుగో స్థానం దక్కింది. ఇందులో గాబ్రియెల్ (16.43 మీ.బీ స్వీడెన్), హిబెర్ట్ (16.05 మీ.బీ జమైకా) వరుసగా స్వర్ణ, రజతాలు గెలిచారు. మహిళల 5000 మీ. ఫైనల్లో అంకిత నిరాశపరిచింది. పది మంది పాల్గొన్న ఈ ఈవెంట్లో ఆమె (17 ని.17.68 సెకన్లు) ఎనిమిదో స్థానంలో నిలిచింది. జూనియర్ వరల్డ్ చాంపియన్షిప్లో 1 రజతం, 2 కాంస్యాలతో భారత్ తమ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి పోటీలను ముగించింది.