న్యూదిల్లీ: పరువునష్టం కేసులో రెజ్లర్ బజరంగ్ పునియాకు దిల్లీలోని పాటియాలా హౌస్కోర్టు ఊరటనిచ్చింది. కిర్గిస్తాన్లో జరిగే ఆసియా క్రీడల కోసం సిద్ధమవుతున్నాడని… అతని తరపున న్యాయవాది కోర్టుకు విన్నవించడంతో కేసు విచారణను వాయిదా వేసి… అక్టోబర్ 17న వ్యక్తిగతంగా హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. ఆగస్టు 3న పాటియాలా హౌస్ రెజ్లింగ్ కోచ్ నరేశ్ దహియా ఒలింపిక్ పతక విజేత రెజ్లర్ పునియాపై పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు… సమన్లు జారీ చేసింది. పిటిషన్పై గురువారం విచారణ సందర్భంగా పునియా త్వరలో ఆసియా క్రీడలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో కిర్గిస్తాన్కు వెళ్లనున్నాడని, అక్టోబర్ 4 నుంచి 7 వరకు జరిగే రెజ్లింగ్ పోటీల్లో పాల్గొంటాడని అతని తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో కోర్టు విచారణను అక్టోబర్ 17వ తేదీకి వాయిదా వేసింది. ఈ ఏడాది మే 10న జంతర్ మంతర్ వద్ద నిరసన సందర్భంగా పునియా విలేకరుల సమావేశంలో తనపై అవమానకర రీతిలో వ్యాఖ్యలు చేశాడని ఆరోపిస్తూ నరేశ్ దహియా పరువునష్టం కేసు దాఖలు చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలపై అగ్రశ్రేణి రెజ్లర్లు 30 మంది జనవరిలో ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్తో పాటు పలువురు కోచ్లపై రెజర్లు తీవ్ర ఆరోపణలు చేశారు. బ్రిస్ భూషణ్తో పాటు కోచ్ లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సమ్మెకు దిగగా… కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ వారితో చర్చలు జరిపిన అనంతరం రెజర్లు ఆందోళన విరమించారు.