డొమినికా: భారత యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రంలోనే సత్తా చాటాడు. ఆడుతున్న తొలి టెస్టులోనే 171 పరుగులు సాధించాడు. భారత టెస్టు చరిత్రలో అరంగేట్రంలో విదేశీ గడ్డపై శతకం బాదిన ఓపెనర్గా రికార్డు పుటల్లోకి ఎక్కాడు. సంయ మనం, నిలకడ, దూకుడు కలబోసిన ఆటతీరుతో కరేబియన్ బౌలర్లను దీటుగా ఎదుర్కొని సుదీర్ఘ సమయం క్రీజులో నిలిచాడు. అటు కెప్టెన్ రోహిత్ శర్మ (103) కూడా చాలా రోజుల తర్వాత బ్యాట్కు పనిచెబుతూ శతకం సాధించి జట్టు భారీ స్కోరుకు దోహదపడ్డాడు. ఫలితంగా వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు మూడోరోజు శుక్రవారం భోజనం విరామం సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 400 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లీ (72), రవీంద్ర జడేజా (21) ఉన్నారు. ఇప్పటికే టీమిండియాకు 250 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అంతకు ముందు విండీస్ తొలి ఇన్నింగ్స్లో 150 పరుగులకు ఆలౌటైన సంగతి విదితమే. రెండో రోజు వికెట్ నష్టపోకుండా 80 పరుగులతో బ్యాటింగ్ కొనసాగించిన ఓపెనర్లు యశస్వీ, రోహిత్ విండీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ క్రీజులో నిలిచారు. అరంగేట్ర హీరో యశస్వీ కరేబియన్ గడ్డపై ఆత్మవిశ్వాసం కనబర్చాడు. ఆడుతోంది తొలి టెస్టు అనే భావన కనిపించనీయలేదు. అటు రోహిత్ కూడా చాలా రోజుల తర్వాత ఆకట్టుకున్నాడు. అయుతే తొలిరోజు మాదిరి వేగం కనిపించలేదు. స్లో పిచ్ కావడంతో విండీస్ స్పిన్నర్లు కార్న్వాల్, వారికన్ సుడులు తిరిగే బంతులతో విసిగించారు. దీంతో మొదటి సెషన్ 32 ఓవర్లలో 66 పరుగులు మాత్రమే వచ్చాయి. కానీ ఓపిగ్గా క్రీజులో నిలిచిన రోహిత్, యశస్వీ అర్ధసెంచరీలు సాధించి వికెట్ను కోల్పోకుండా లంచ్ విరామానికి వెళ్లారు. రెండో సెషన్ ఆరంభంలో భారత్ ఆటలో జోరు పెరిగింది. యశస్వీ, రోహిత్ అడపాదడపా బౌండరీలు రాబట్టడంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంలోకి వెళ్లింది. ఇదే జోరుతో మొదట జైస్వాల్ తొలి శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. అటు మరింత ఓపిగ్గా ఆడిన రోహిత్ చక్కటి ఫోర్తో టెస్టుల్లో పదో శతకం పూర్తి చేసుకున్నాడు. అయితే మరుసటి బంతికే అథనజె అతడి వికెట్ తీయడంతో తొలి వికెట్కు 229 పరుగుల భారీ భాగస్వామ్యం ముగిసింది. వన్డౌన్ వచ్చిన గిల్ (6) వారికన్ బౌలింగ్లో అథనజెకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. వెస్టిండీస్పై భారత్ తరపున తొలి వికెట్కు అత్యధిక భాగస్వామ్యం (229) అందించిన జోడీగా రోహిత్-యశస్వీ నిలిచారు.