ఫ్యామిలీ డాక్టర్ .. వైద్యం మరింత చేరువ
ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు అవగాహన కల్పించాలి
రెవిన్యూ శాఖ రాష్ట్ర మంత్రి ధర్మాన ప్రసాద్ రావు
విశాలాంధ్ర – శ్రీకాకుళం: వినూత్న పద్ధతికి కేరాఫ్ ఫ్యామిలీ డాక్టర్ అని, ఈ కాన్సెప్ట్ ద్వారా సంచార వాహనాలు ఇంటి ఇంటికీ తిరిగి వైద్య సేవలు అందించనున్నాయి అని రెవెన్యూ శాఖా మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు సంబంధిత వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ సామాన్యుల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఫ్యామిలీ డాక్టర్ అనే విధానాన్ని తీసుకు వచ్చామని అన్నారు. అతి సామాన్య కుటుంబాలకు వైద్య సేవలు అందించేందుకు వీలుగా, పేదల గుమ్మం దగ్గరకు వైద్య సేవలు అందించేవిధంగా ఈ సేవల అందిస్తారు.ప్రతి పీహెచ్సీలో ఉండే ఇద్దరు వైద్యులు రోజు విడిచి రోజు తమకు కేటాయించిన గ్రామాలలో వైద్య పరీక్షలు నిర్వహిస్తారు అని, దీర్ఘ కాలిక రోగులకు నిరంతరం మందులు, ఇతర వైద్య సేవలు అందించనున్నారు. గ్రామాల్లో ఉండే అతి సాధారణ కుటుంబాలు వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉంటారు అని, ప్రాణాపాయ స్థితిలో ఉంటారని, ఇటువంటి వర్గాలకు చేరువగా మానవతా దృక్పథంతో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి అన్నారు. అలానే 14 రకాల రోగ నిర్థారణ పరీక్షలు అందుబాటులో ఉండనున్నాయి అన్నారు.
రిఫర్ చేయాల్సి వస్తే సమీప పెద్దాస్పత్రికి రిఫర్ చేస్తారు. దేశంలోనే ప్రథమంగా ఈ సేవలు తీసుకువచ్చామని, వీటి లక్ష్యాలు చేరుకునేందుకు వైద్య సిబ్బంది అంతా కలిసి పనిచేయాలని కోరారు. అలానే గ్రామాల్లో ఉండే ప్రజలు వైద్య సేవలు వినియోగించుకోవాలని ప్రయివేటు వైద్యం పై మక్కువ పెంచుకునే కన్నా ఇటువంటి ప్రభుత్వ సేవలను వినియోగించుకోవాలని కోరారు. మారిన పరిస్థితుల దృష్ట్యా సర్కారు వైద్యం ఇవాళ ఉన్నత ప్రమాణాలతో అందుతున్నాయి అనేందుకు ఎంతో కృషి చేస్తున్నాం అని అన్నారు. అలానే రిమ్స్ ఆస్పత్రికి 900 పడకలు ఏర్పాటుచేశామని, అలానే వైద్య, వైద్యేతర సిబ్బందిని అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. చైతన్య వంతులయిన ప్రజా ప్రతినిధులు ఈ తరహా సేవలపై ప్రజలను ఎడ్యుకేట్ చేయాలని, ప్రభుత్వ వైద్యంను క్షేత్ర స్థాయిలో అందించడంలో భాగంగా అంతా కలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేద్దామన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి మీనాక్షి, ఫ్యామిలీ ఫిజీషియన్ నోడల్ ఆఫీసర్ లక్ష్మీ తులసి, గొండు రఘు, హాబీ బుల్లా ఖాన్, అందవరపు సంతోష్, 104 కోఆర్డినేటర్ లక్ష్మణ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.