ఆర్మీలో అన్ని విభాగాల్లో ఆఫీసర్లుగా అవకాశం
అవగాహన లేక వెనుకబడుతున్న ఉత్తరాంధ్రవాసులు
ఈ నెల 25 నుంచి ఆన్లైన్ అవకాశం
మెరిట్ సాధించిన వారికి ఉచితంగా శిక్షణ
ఇండియన్ ఆర్మీ కాలింగ్ డైరక్టర్ బి.వి రమణ
విశాలాంధ్ర – శ్రీకాకుళం: భారత రక్షణ రంగంలో ఆఫీసర్ క్యాడర్లో మన తెలుగు వారి శాతం చాలా తక్కువగా ఉందని, అధికార హోదాపై సరైన అవగాహన లేకపోవడమే దీనికి కారణమని ఇండియన్ ఆర్మీకాలింగ్ డైరక్టర్ బి.వి రమణ అన్నారు. నగరంలోని ఇండియన్ ఆర్మీ కాలింగ్ కార్యాలయ ఆవరణలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డైరక్టర్ బి వి రమణ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో యువతను యుపీఎసీఎస్, ఎన్డీఎ ఆఫీసర్స్, టీఇఎస్, సీడీఎస్ ఆఫీసర్లను ప్రోత్సహించేందుకు ఈ ఏడాది నుంచి టెన్త్ అర్హతతో ప్లస్ 2 తో డిఫెన్స్ కోర్సును ప్రారంభించామని తెలిపారు. ఈ కోర్సును పూర్తిస్థాయి సైనిక శిక్షణతో జిల్లాలో ప్రారంభించడంతో యువతకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఇంటర్ విద్యతో ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్, పారామిలటరీ వంటి రంగాల్లో ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు ఉన్నా ఉత్తరాంధ్ర యువతకు అవగాహన లేక జిడి స్థాయి కింద ఉద్యోగాలకే వెళ్తున్నారన్నారు. ఉత్తరాంధ్ర నుంచి సుమారు 30 వేల మంది వరకు ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ వంటి రక్షణ రంగాల్లో పనిచేస్తున్నారని, కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఆర్మీ అభ్యర్థుల కోసం ఒక అకాడమీని, ఆర్మీ ఆసుప్రతి కానీ, అన్ని సౌకర్యాలతో కూడిన క్యాంటీన్ వంటివి నెలకొల్పక పోవడం బాధాకరమన్నారు.
25 నుంచి రిజిస్ట్రేషన్కు అవకాశం
టెన్త్ ప్లస్ 2తో డిఫెన్స్ లో ఆఫీసర్ ఉద్యోగాలు సాధించే దిశగా యువతకు ప్రోత్సహించడంలో భాగంగా ఈ నెల 25 నుంచి ఏప్రిల్ 25 వరకు పదోతరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులు www.indianarmycalling.com వెబ్సైట్లో 100 రుఫీస్ చెల్లించి రిజిస్ర్టేషన్ చేయించుకోవాలని కోరారు. వీరికి మే నెలలో అకాడమీ ఆధ్వర్యంలో ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తామని చెప్పారు. ఈ పరీక్షలో అత్యధిక మార్కులు వచ్చిన వారికి రెండేళ్ల పాటు ఇండియన్ ఆర్మీ కాలింగ్ సెంటర్ ద్వారా ఉచితంగా ఇంటర్ విద్యా తో పాటు డిఫెన్స్ శిక్షణ అందిస్తామని వివరించారు. ఈ అవకాశాన్ని డిఫెన్స్ వైపు వెళ్లాలనుకుంటున్న పదోతరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు 6281284246 , 8712704951 నెంబర్లకు సంప్రదించాలని కోరారు. అనంతరం అడ్మిషన్ల కు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సమావేశంలో ఛైర్మన్ గోవిందరావు రెండో ఇన్చార్జ్ సురేంద్ర, ఎఓ శంకరరావులు పాల్గొన్నారు.