- ర్యాలీగా కదలిన విద్యార్థులు
- స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తిని చాటిన వైనం
విశాలాంధ్ర – శ్రీకాకుళం : ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా నగరంలో ఇవాళ పలు విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. క్విట్ ఇండియా ఉద్యమం ఆరంభం అయి ఎనభై ఏళ్లు నిండిన సందర్భంగా వీరంతా నాటి సంగ్రామ కాలాన్ని, నాటి వీరుల స్ఫూర్తిని తలుచుకుంటూ నినాదాలు చేస్తూ స్థానిక సూర్య మహల్ కూడలి నుంచి వైఎస్సార్ కూడలి (ఏడు రోడ్ల జంక్షన్) వరకూ ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన మాట్లాడుతూ.. వీరుల త్యాగాలను తల్చుకుంటూ నాటి విముక్త పోరాటంలో యోధుల స్ఫూర్తిని, వారిని మరోసారి స్మరించుకుంటూ దేశానికి స్వతంత్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన వేళ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం ఎంతైనా అభినందనీయమన్నారు. ఎన్నో అవమానాలు, బాధలు, దుఃఖాలు దాటుకుని సాధించుకున్న స్వాతంత్ర్యాన్ని సద్వినియోగం చేసుకోవడం ఇవాళ అందరి బాధ్యత అని అన్నారు. ఓ సమున్నత లక్ష్యంతో చేపడుతున్న ఇటువంటి ఉత్సవాలకు దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలూ పాల్గొంటుండడం, ముఖ్యంగా యువత ఇటువంటి స్ఫూర్తిని అందుకుని ముందుకు ప్రయాణించడం ఎంతైనా ఆనంద దాయకమని అన్నారు. ఇటువంటి మంచి కార్యక్రమాలు దేశం కోసం ప్రాణాలర్పించిన అమరుల త్యాగాలకు ఓ గొప్ప నివాళి వంటివి అని, అదేవిధంగా వారిని గౌరవించుకునే తీరుకు ఇవి సంకేతంగా నిలుస్తాయని అన్నారు. కార్యక్రమానికి వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు జామి భీమ శంకర్ నేతృత్వం వహించారు. ర్యాలీని ప్రభుత్వ మహిళ కాలేజీ,చైతన్య, కాకినాడ, విద్యాదరి సంస్థలు సంయుక్తంగా నిర్వహించాయి. రాష్ట్ర తూర్పు కాపు, కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్లు మామిడి శ్రీకాంత్, అంధవరపు సూరిబాబు, ఆర్డీవో శాంతి, డిఎస్డ్ఓ లక్ష్మీ, ఎమ్మార్వో వెంకట్రావు, పట్నాల శ్రీనివాసరావు, గీత శ్రీకాంత్, అంధవరపు ప్రసాద్, హెచ్. కిరణ్కుమార్, శాస్త్రి, మండవిల్లి రవి, ఖాన్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.