భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కేసు నమోదు అయింది. ఐపీసీ 506 కింద ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ నేత చెరుకు సుధాకర్ ఫిర్యాదుతో వెంకటరెడ్డిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. చెరుకు సుధాకర్తో పాటు ఆయన కుమారుడిని కూడా చంపుతానంటూ కొద్దిరోజుల క్రితం ఫోన్లో వెంకటరెడ్డి బెదిరింపులకు దిగిన ఆడియో బయటకు లీకైంది. ఈ ఆడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.సొంత పార్టీ నేతనే వెంకటరెడ్డిపై కేసు పెట్టడంతో ఈ వ్యవహారం ప్రస్తుతం టీ కాంగ్రెస్లో ప్రకంపనలు రేపుతోంది. ఇటీవల చెరుకు సుధాకర్ కుమారుడికి ఫోన్ చేసిన వెంకటరెడ్డి.. మిమ్మల్ని చంపేసేందుకు తన నుంచి లబ్ధి పొందినవారు 100 కార్లలో తిరుగుతున్నారని, నీ హాస్పిటల్ను కూడా కూలగొడతారంటూ బెదిరించారు. నీ హాస్పిటల్ ఉండదని, తన అభిమానులను తాను ఆపలేనని తెలిపారు. ఈ సందర్భంగా రాయడానికి కూడా వీలుకాని మాటలతో వెంకటరెడ్డి బూతుపురాణం అందుకున్నారు. చెరుకు సుధాకర్ గత కొంతకాలంగా వెంకటరెడ్డిపై విమర్శలు చేస్తోన్నారు. దీంతో తనపై విమర్శలు చేస్తే అభిమానులు ఊరుకోరంటూ చెరుకు సుధాకర్ కుమారుడికి వెంకటరెడ్డి ఫోన్ చేని హెచ్చరించారు.ఈ ఆడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో.. సోమవారం వెంకటరెడ్డి స్పందించారు. తాను ఉద్దేశపూర్వకంగా అనలేదని, భావోద్వేగంతో మాట్లాడాల్సి వచ్చిందంటూ తనకు తాను సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇప్పటివరకు తాను ఎవరినీ దూషించలేదంటూ చెప్పుకొచ్చారు. చెరుకు సుధాకర్పై గతంలో పీడీ యాక్ట్ కేసు నమోదు చేస్తే తాను అండగా ఉన్నానని తెలిపారు. తనను తిడితే చెరుకు సుధాకర్కు నకిరేకల్ టికెట్ వస్తుందా? అంటూ వెంకటరెడ్డి ప్రశ్నించారు. ఎప్పటినుంచో చెరుకు సుధాకర్ తనను విమర్శిస్తూ వస్తున్నారని, కానీ తాను ఇప్పటివరకు ఒపిక పట్టానని అన్నారు. కాల్ రికార్డ్ చేశారని తనకు తెలుసని, బెదిరింపులు చేయడానికి కాల్ చేయలేదని వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు.