రాజకీయ కక్షతో జాతీయ హోదా ఇవ్వని కేంద్రం
వివక్షను ఎండగట్టిన మంత్రి హరీశ్ రావు
విశాలాంధ్ర-హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్ట్ జాతీయ హోదాపై కేంద్రం తప్పుడు ప్రచారం చేస్తోందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు విమర్శించారు. శుక్రవారం పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం కాళేశ్వరం విషయంలో చేసిన ప్రకటనపై మంత్రి ట్విట్టర్ వేదికగా కేంద్రం పై విరుచుకుపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదన్న కేంద్రమంత్రి బిశ్వేశర్ తుడు వ్యాఖ్యలు అవాస్తవమన్నారు. జాతీయ హోదా కల్పించాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, నాడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా నేను ఎన్నోసార్లు ప్రధానికి, జలశక్తి శాఖ మంత్రికి వినతి పత్రాలు ఇచ్చామని తెలిపారు. వాస్తవాలను దాచిపెట్టి పార్లమెంట్లో కేంద్ర మంత్రి చేసిన ప్రకటన సభను, ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉందన్నారు. కేంద్ర మంత్రి చెప్పినట్టుగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సిడబ్ల్యుసి అన్ని రకాల అనుమతులు ఇచ్చిందన్నారు. కేంద్ర జల శక్తి శాఖకు చెందిన టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అనుమతులు సైతం లభించాయని, ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారని, అయితే కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. 2018లో టీిఆర్ఎస్ ఎంపీలు కాళేశ్వరానికి జాతీయ హోదాపై పార్లమెంట్లో ప్రశ్నించగా నాటి జలశక్తి శాఖ మంత్రి నితిన్ గడ్కరి స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వానికి సమీప భవిష్యత్తులో ఏ ప్రాజెక్టుకూ జాతీయ హోదా ఇచ్చే ఆలోచన లేదని పేర్కొన్నారని గుర్తు చేశారు. కానీ ఈ ప్రకటనకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం బీజేపీ పాలిత రాష్ట్రాలైన కర్ణాటకలోని అప్పర్ భద్ర ప్రాజెక్టుకు, మధ్యప్రదేశ్ లోని కెన్ – బెట్వా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిందన్నారు. తెలంగాణ ప్రతిపాదనను మాత్రం పక్కన పెట్టడం… తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ రాజకీయ వివక్షకు నిదర్శనం కాదా అని నిలదీశారు. కేడబ్ల్యుడిటి-2 కేటాయింపులపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతున్న సమయంలోనే అప్పర్ భద్ర ప్రాజెక్టుకు సిడబ్ల్యుసి అనుమతులు ఇచ్చిందన్నారు. న్యాయవిచారణ పూర్తికాకముందే కేంద్ర ప్రభుత్వం ఏకంగా జాతీయ హోదా ప్రకటించిందని, కానీ అన్ని రకాల అనుమతులు ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా జాతీయ హోదా ప్రకటించలేదన్నారు.