దేశానికి ఇప్పుడు కొత్త దిశానిర్దేశం కావాలి.. భారత్ను సరైన దిశలో తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్తో సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి శిబూ సోరెన్తో మంచి అనుబంధం ఉంది. తెలంగాణ ఉద్యమానికి శిబూ సోరెన్ ఎన్నోసార్లు మద్దతు పలికారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు అని కేసీఆర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సరైన దిశలో నడవడం లేదు.. దాన్ని సరి చేయాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. ఈ నేపథ్యంలో పలువురి నేతల్ని కలవడం జరుగుతోంది. కొత్త పంథాలో.. కొత్త విధానంలో దేశాన్ని నడిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. యాంటీ బీజేపీ ఫ్రంట్ సాగిస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ..ఎటువంటి ఫ్రంట్ లేదని, ఏర్పడబోయే ఫ్రంట్ మున్ముందు తెలుస్తుందన్నారు.