సీఎం కేసీఆర్ నాయకత్వంలో మహిళా సాధికారత, సంక్షేమం, సమగ్ర వికాసం కోసం చేపడుతున్న పథకాల అమలులో అంగన్వాడీ టీచర్ల పాత్ర అత్యంత కీలకమైందని స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. వారిని వర్కర్లు అనకుండా టీచర్లుగా సంబోధించాలని ఆదేశాలు ఇచ్చారని, వీరి వేతనాలను పీఆర్సీలో పెట్టారని మంత్రి తెలిపారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం దగ్గర ఆధునీకరించిన జిల్లా స్త్రీ,శిశు సంక్షేమ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ..మహిళలు, శిశువుల ఆరోగ్యం కోసం తల్లి తర్వాత తల్లిలాగా సేవలందిస్తున్న అంగన్వాడీలను అంతే గౌరవంగా చూడాల సీఎం కేసీఆర్ వారికి అన్ని విధాల ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు.తెలంగాణ రాష్ట్రం మహిళల సాధికారత, సమగ్ర సేవల , రక్షణ, పోషణ, ఆరోగ్యం కోసం దేశంలోనే అత్యుత్తమంగా పనిచేస్తోందన్నారు. గిరిపోషణ, పోషణ్ అభియాన్లో రాష్ట్రపతి, ప్రధాన మంత్రి అవార్డులు కూడా రావడం మన అంగన్వాడీలు చేస్తున్న సేవలకు గుర్తింపు అన్నారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు త్వరలోనే రాష్ట్రంలో ఉండే ఖాళీలు భర్తీ చేస్తున్నామని ప్రకటించారు.