నిరుద్యోగం అన్ని ప్రభుత్వాలకు సవాల్గా మారిందని, అవకాశాలను అందిపుచ్చుకున్నప్పుడే అందరికీ ఉపాధి కల్పన సాధ్యమవుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. దళిత బంధును పుట్నాలు, బఠాణీల మాదిరిగా పంచేందుకు పెట్టలేదని పేర్కొన్నారు. సంపద పునరుత్పత్తి కావాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ఉద్ఘాటించారు. హైదరాబాద్ సైఫాబాద్లో దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బిజినెస్ ఫెసిలిటేషన్ సెంటర్, మోడలో కేరీర్ సెంటర్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. అమెరికా ప్రభుత్వాన్ని నడుపుతున్న జో బైడెన్ కావొచ్చు.. దేశాన్ని నడుపుతున్న ప్రధాని మోదీ కావొచ్చు.. రాష్ట్రాన్ని నడుపుతున్న సీఎం కేసీఆర్ కావొచ్చు.. అందరి ముందున్న అతి పెద్ద సవాల్ ఏంటంటే.. ఉపాధి కల్పన, నిరుద్యోగం అని కేటీఆర్ తెలిపారు. ప్రతి సంవత్సరం లక్షల మంది విద్యార్థులు చదువుకొని విద్యావంతులు అవుతున్నారు. వారి విద్యకు, అర్హతకు తగ్గ ఉపాధి కల్పించడం అంటే ప్రతి ప్రభుత్వానికి అది పెద్ద సవాల్ అని పేర్కొన్నారు. ప్రభుత్వం, ప్రభుత్వ రంగంలో ఉపాధి కల్పన పరిమితంగానే ఉంటుందని తెలిపారు. మిగతా వారు స్వయం ఉపాధి అవకాశాల వైపు వెళ్లాలని, పారిశ్రామికవేత్తలుగా మారాలని సూచించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను రూపొందించి అమలు చేసిందన్నారు. పరిశ్రమలు స్థాపించే వారి కోసం టీఎస్ ఐపాస్ ద్వారా 15 రోజుల్లోనే అన్ని అనుమతులు ఇస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.