అపోహ వీడి అందరూ టీకా వేసుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కోరారు. దేశంలో వంద కోట్ల టీకాల పంపిణీ పూర్తి సందర్భంగా గవర్నర్ తెలుగులో ప్రత్యేక సందేశం ఇచ్చారు. ‘ఈ ఏడాది జనవరి 16న ప్రారంభమైన టీకా పంపిణీ.. నేటి వరకు వంద కోట్ల డోసుల పంపిణీకి చేరుకోవడం సంతోషంగా, గర్వకారణంగా ఉంది. మనం టీకాను ఉత్పత్తి చేయడమే కాకుండా, ఆ టీకాను ప్రజలకు ఇవ్వడంలో ప్రపంచ దేశాలకు భారత్ ఆదర్శంగా నిలిచాం. నేడు భారత్ ప్రపంచ దేశాలకు కొవిడ్ టీకాను అందించే స్థాయికి చేరింది. మన వాడ, మన గ్రామం, మన పట్టణంలో ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకా తీసుకోవాలి. కొవిడ్ టీకా తీసుకున్న తర్వాత కూడా జనాలు భౌతిక దూరం పాటించాలి. మాస్కు ఎల్లప్పుడూ ధరిస్తూ, చేతులు తరుచుగా శుభ్రంగా కడుక్కోవాలి. కొవిడ్ నియంత్రణ చర్యల్లో పాల్గొన్న డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలు, శానిటేషన్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు.’ అని పేర్కొన్నారు. వంద కోట్ల టీకాల పంపిణీ పూర్తి సందర్భంగా ఇవాళ సనత్ నగర్ ఈఎస్ఐ ఆస్పత్రిని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ సందర్శించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. దేశంలో ఉత్పత్తి చేసిన టీకా తీసుకున్నందుకు గర్విస్తున్నానని తెలిపారు.