వరంగల్ నగరంలోని అజంజాహి మిల్స్ ప్రాంగణంలో వరంగల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం నిర్మాణం చేపడతామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. సోమవారం మంత్రి వరంగల్ జిల్లా కలెక్టర్ , రెవెన్యూ అధికారులతో వరంగల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం భవన నిర్మాణానికి కావాల్సిన భూ సేకరణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. వరంగల్ రూరల్ జిల్లా స్థానంలో ఇటీవల వరంగల్ జిల్లా ఏర్పడి నందున జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణానికి కావాల్సిన భూమిని వెంటనే సేకరించాల్సిందిగా సీఎం ఆదేశించారన్నారు. భవన నిర్మాణానికి కావాల్సిన భూ సేకరణ ప్రక్రియ పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వానికి భవన నిర్మాణ నిమిత్తం ప్రతిపాదనలు సమర్పించాలని మంత్రి ఆదేశించారు.