మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి
విశాలాంధ్ర, పటాన్ చెరువు : అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని తెలంగాణ శాసన మండలి ప్రొటెం చైర్మన్ వి. భూపాల్ రెడ్డి పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన 75 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు భూపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీస్ వందనాన్ని స్వీకరించారు. ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలో వివిధ శాఖల ద్వారా జరిగిన అభివృద్ధిని వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు కాళేశ్వరం, మిషన్ భగీరథ, రైతుబంధు, రైతు బీమా, తదితర పథకాలతో అద్భుతాలను సృష్టించారన్నారు. అదే అంకుఠిత దీక్ష తో దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపేలా ఆర్థిక సహాయం మరియు దిశానిర్దేశం చేసే అద్భుతమైన ‘‘దళిత బంధు’’ పథకం రూపొందించారన్నారు.ఈ పథకంలో అర్హులైన ఎస్సీ కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించ బడుతుందన్నారు. ఈ పథకంలో అర్హులైన అన్ని దళిత కుటుంబాలకు దశలవారీగా లబ్ధి పొందేలా అమలు చేయనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన ఇతర అద్భుతమైన పథకాల మాదిరిగానే దళిత బంధు పథకం దేశానికి ఆదర్శంగా నిలిచి దళితుల కుటుంబాల్లో సంతోషాలు వెల్లివిరుస్తాయని ఆయన విశ్వసిస్తున్నానని అన్నారు. అనంతరం జిల్లాకు సంబంధించిన రుణమాఫీ చెక్కును జిల్లా కలెక్టర్ వ్యవసాయ శాఖఅధికారికి అందజేశారు. ఉత్తమ సేవలు అందించిన వివిధ శాఖలకు చెందిన అధికారులు సిబ్బందికి ప్రశంసాపత్రాలను బహూకరించారు. సంగారెడ్డి జిల్లా తారా డిగ్రీ కళాశాల విద్యార్థి షమీంకు ఉస్మానియా యూనివర్సిటీ లో టాప్ ర్యాంక్ సాధించినందుకు గాను ప్రశంసా పత్రం ,పదివేల నగదు పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వుసుల భానుప్రకాష్ రచించిన అమృత మూర్తులు దేశభక్తి కావ్యాన్ని ప్రొటెం చైర్మన్ ఆవిష్కరించారు. ఇంటింటా ఇన్నో వేటర్ కార్యక్రమంలో జిల్లానుండి రాష్ట్ర స్థాయిలో ఎంపికైన నలుగురు విద్యార్థులను అభినందించి, వారి ఇన్నోవేషన్ ప్రదర్శనను తిలకించారు. వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఆయన సందర్శించారు. పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. అంతకుముందు వివిధ శాఖలు శకటాలను ప్రదర్శించాయి. ఈ వేడుకలలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు, జిల్లా ఎస్పీ రమణ కుమార్, జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి, అదనపు ఎస్పీ, మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి, మాజీ శాసనసభ్యులు చింతా ప్రభాకర్, డీసీఎంఎస్ చైర్మన్ శివ కుమార్, గ్రంథా లయ చైర్మన్ నరహరి రెడ్డి, జిల్లా అధికారులు , సిబ్బంది,ఇతర ప్రజాప్రతినిధులు, ప్రజలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.