తెలంగాణలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నా విమర్శలు చేస్తున్నవారికి కనిపించడం లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలంలోని వెంకటాపుర్ లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రి కేటీఆర్ శనివారం ప్రారంభించారు.40 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ లు పంపిణీ చేసిన మంత్రి కేటీఆర్, లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పారదర్శకంగా కేటాయించిన అధికారులను మంత్రి అభినందించారు. గ్రామంలో మరో 40 మంది ఇల్లులేని వారిని గుర్తించి పట్టాలు ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు. సొంత ఇంటి స్థలం ఉన్నవారికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టించి ఇస్తామని వెల్లడిరచారు. గ్రామంలో అన్ని సంఘాల భవనాలు త్వరలోనే పూర్తి అవుతాయని, కొన్నింటికి ఇప్పటికే మంజూరు చేశామని మంత్రి కేటీఆర్ అన్నారు. గ్రామాలలో 20 లక్షలతో కేసీఆర్ భవన్ లు ఏర్పాటుచేశామని తెలిపారు. తెలంగాణ రాకముందు గ్రామానికి రూ.50 లక్షలు రావడమే కష్టంగా ఉండేదని, కానీ ఇప్పుడు ఒక్కో గ్రామానికి రూ.5 కోట్లు పైనే నిధులు అందుతున్నాయన్నారు.