మంత్రి కేటీఆర్
గత ఏడున్నర సంవత్సరాలుగా రాష్ట్రం అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి సాధిస్తోంది. వివిధ కార్యక్రమాలను అమలు చేస్తూ అభివృద్ధిలో ముందుకు పోతున్నాం అని కేటీఆర్ స్పష్టం చేశారు. పట్టణాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ పట్టణాభివృద్ధిలో సమూలమైన మార్పులు తీసుకువచ్చారని మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం ఆయన హైదరాబాద్లో మాట్లాడుతూ, మునిసిపల్ శాఖలో ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి వివరించారు. రెండు వెల కోట్లకు పైగా నిధులు మునిసిపల్ శాఖకు విడుదల చేసాము. నిధుల విషయంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని అన్నారు. పార్కులు, మోడల్ మార్కెట్లు, వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లు, ఎల్ఈడీ లైట్లు, పబ్లిక్ టాయిలెట్స్, వైకుంఠధామాలు, ఓపెన్ జిమ్స్, అర్బన్ లంగ్ స్పేసెస్కు నిధులు ఖర్చు పెట్టాం. మౌలిక వసతుల మీద దృష్టి సారించాం. అర్బన్ మిషన్ భగీరథ కార్యక్రమంలో భాగంగా నీటి సమస్యను పరిష్కరించాం. పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించి సమగ్రమైన ప్రణాళికతో ముందుకు పోతున్నాం. కొత్త డంప్ యార్డులు ఏర్పాటు చేశాం. దేశంలో ఎక్కడా లేని విధంగా చట్టంలోనే గ్రీన్ బడ్జెట్ను ప్రవేశపెట్టి, హరిత పట్టణాలను తయారు చేసేందుకు కృషి చేస్తున్నాం. టీఎస్ బీపాస్ చట్టాన్ని అమలు చేశాం అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
కాగా స్వచ్ఛ భారత్ మిషన్లోని పలు విభాగాల్లో తెలంగాణ దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా నిలవడం, కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో రాష్ట్రాల క్యాటగిరీలో తెలంగాణకు 12 అవార్డులు రావడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.ఈ అవార్డులు రావడాన్ని పట్టణ ప్రగతికి లభించిన గుర్తింపుగా భావిస్తున్నాం. ఈ నెల 20న విజ్ఞాన భవన్లో రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డులు అందుకోబోతున్నాం. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు గర్వకారణం. మున్సిపల్ అధికారులను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను అని కేటీఆర్ తెలిపారు.