తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి పలు సంఘాలు యత్నించాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మరడంతో ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు (వీఆర్ఏ), కాంగ్రెస్ మత్స్యకార విభాగం, ఉపాధ్యాయ సంఘాలు, రెడ్డి సంఘం నేతలు విడతల వారీగా అసెంబ్లీ ముట్టడికి వచ్చారు.
వందలాది మంది వీఆర్ఏలు నేడు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. దీంతో అసెంబ్లీ ఎదుట ప్రధాన రహదారి మూసేశారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్ వైపు నుంచి అసెంబ్లీ వైపునకు భారీ సంఖ్యలో దూసుకొచ్చిన వీఆర్ఏలు అసెంబ్లీ ఎదుట బైఠాయించి నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. వారి తాకిడిని నిలువరించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. పరిస్థితి అదుపు తప్పడంతో వారిపై లాఠీ చార్జి చేసి, ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. దీంతో వీఆర్ఏల నుంచి ప్రతిఘటన ఎదురై తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. మరోవైపు మత్స్యకారుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ ఫిషరీస్ విభాగం ఛైర్మన్ మెట్టు సాయికుమార్ ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. ఆ సంఘం ప్రతినిధులు పెద్దఎత్తున అసెంబ్లీ ముట్టడికి వచ్చారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.