ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్
హైదరాబాద్: ఇంద్రవెల్లి సభ విజయవంతం కావడంతో తెరాసకు చురుకు తగిలినట్లు అయిందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అన్నారు. గాంధీ భవన్లో మీడియా మాట్లాడుతూ.. ‘‘రాష్ట్ర వ్యాప్తంగా పల్లెపల్లెలో దండోరా సభలను ఏర్పాటు చేస్తాం. ఏడేళ్లలో ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ కింద కేటాయించిన రూ.65వేల కోట్లను ఖర్చు చేయలేదు. ఆ నిధులు ఖర్చు చేసి ఉంటే దళిత బంధు అవసరం లేదు. కేసీఆర్ ఎప్పటికీ దళిత బంధువు కాలేరు. విద్యాసంస్థల్లో ఉపాధ్యాయుల కొరత ఉంది. కేటీఆర్, తెరాస ప్రజాప్రతినిధులు టీచర్ల కొరత ఉన్న విద్యాసంస్థల్లో వారి పిల్లలను చదివిస్తారా? యుద్ధం మొదలైంది.. తెరాసను ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టం. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరే వరకు పోరాటం సాగిస్తాం. చావడానికైనా వెనకాడబోయేది లేదు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో దళిత బంధు పేరుతో తెరాస కొత్త నాటకం ఆడుతోంది. ఇప్పుడు ఉప ఎన్నిక జరిగితే ఓటమి తప్పదనే భయంతో ఆలస్యం చేసేందుకు కొవిడ్ను తెరపైకి తీసుకొచ్చారు’’ అని దాసోజు తెలిపారు.
కేసీఆర్ మోసాలను ప్రజలకు వివరిస్తాం: మహేశ్కుమార్ గౌడ్
శనివారం నుంచి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు రాష్ట్రంలోని గ్రామాల్లో పర్యటిస్తారని పీసీసీ కార్యనిర్వాహక అధ్యుక్షుడు మహేశ్కుమార్ గౌడ్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో ప్రజలకు వివరిస్తామని చెప్పారు. గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభల ప్రాధాన్యతను గ్రామ గ్రామానికి వెళ్లి ప్రజలకు వివరిస్తామన్నారు. దళితులు, గిరిజనులకు జరుగుతున్న అన్యాయాలను తెలియజేస్తారన్నారు. రచ్చబండ ఏర్పాటు చేసి సీఎం కేసీఆర్ చేస్తున్న మోసాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యే ఇంటివద్ద డప్పు కొట్టే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని మహేశ్కుమార్ తెలిపారు.