సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటనను వీఆర్ఏలు అడ్డుకోవడంపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. ట్విట్టర్ పిట్టకు నిన్న మెట్ పల్లిలో చెరుకు రైతుల సెగ తగిలిందని, ఇవాళ సిరిసిల్లలో వీఆర్ఏల సెగ తగిలిందని అన్నారు. అటు, కేసీఆర్ కు భద్రాచలంలో వరద బాధితుల నుంచి నిరసన ఎదురైందని రేవంత్ వెల్లడిరచారు. ఇక, ఈ తండ్రీకొడుకులు జనం మధ్య స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదని పేర్కొన్నారు. బంగారు తెలంగాణ క్షేత్రంలో వాస్తవ పరిస్థితి ఇదేనని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు గత రెండ్రోజులుగా నిరసనలు తెలియజేస్తున్నారు. ఇవాళ మంత్రి కేటీఆర్ ఓ సమీక్ష నిమిత్తం సిరిసిల్ల కలెక్టరేట్ కు వచ్చారు. సమీక్ష అనంతరం ఆయన కాన్వాయ్ కలెక్టరేట్ నుంచి బయటికి వెళుతుండగా, 50 మంది వీఆర్ఏలు ఒక్కసారిగా కాన్వాయ్ ముందుకు దూసుకొచ్చారు. తమను విధుల్లోకి తీసుకోవాలని, పేస్కేల్ పదోన్నతులు కల్పించాలని వారు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకోగా పోలీసులు రంగప్రవేశం చేశారు. కేటీఆర్ కాన్వాయ్ ముందు వీఆర్ఏలు బైఠాయించే ప్రయత్నం చేయగా, తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు పలువురు వీఆర్ఏలను అరెస్ట్ చేశారు.