కేంద్ర ప్రభుత్వంపై గిరిజనుల ఆగ్రహం
జనాభా ప్రాతిపదికన గిరిజన రిజర్వేషన్ బిల్లును తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిన బిల్లు తమ వద్దకు చేరలేదని కేంద్ర గిరిజనశాఖ సహాయ మంత్రి చేసిన వ్యాఖ్యలపై ఇవాళ సూర్యాపేట జిల్లా కేంద్రంలో గిరిజనులు నల్లా జెండాలు ప్రదర్శించి భారీ ర్యాలీ నిర్వహించారు.అనంతరం పీఎస్ఆర్ సెంటర్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా గిరిజన నేతలు మాట్లాడుతూ.. గిరిజనుల రిజర్వేషన్లు పెంచాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం పంపలేదని తప్పుడు వ్యాఖ్యలు చేసిన బిశ్వేశ్వర్ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. జనాభా ప్రాతిపదికన గిరిజనుల రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచాలని 2017లోనే తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర హోంశాఖకు పంపిందన్నారు. ఈ విషయాన్ని తెలంగాణ వ్యాప్తంగా ఉన్న గిరిజన సోదరులకు తెలుసన్నారు. బిల్లు తమ వద్దకు చేరిందని కేంద్ర హోంశాఖ కూడా అక్నాలెడ్జ్ చేసిందన్నారు. కేంద్ర గిరిజన వ్యవహారాలశాఖ కూడా గిరిజనుల రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదన అంశం కేంద్రం పరిశీలనలో ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో స్పష్టంగా చెప్పిందన్నారు. ఇప్పుడేమో అసలు అలాంటి ప్రతిపాదనేదీ తమ వద్దకు రానేలేదని పార్లమెంట్లో దారుణంగా అబద్ధలాడటం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజనులను అవమానించడమే అని మండిపడ్డారు. దేశ వ్యాప్తంగా లక్షలాదిగా ఉన్న గిరిజన లోకాన్ని ఏకం చేసి కేంద్రంపై పోరు బాట చేస్తామని హెచ్చరించారు.ఈ నిరసన కార్యక్రమంలో సూర్యాపేట నియోజకవర్గ నలుమూలల నుండి వచ్చిన గిరిజనులతో పాటు నేతలు ఎంపీపీ కుమారి బాబు, లచ్చి రాం నాయక్, సర్పంచ్ లు బికారు, అనీల్, నాగు నాయక్, బిక్షం నాయక్, కౌన్సిలర్ లింగా నాయక్, వాంకుడోతు వెంకన్న, బాలాజీ నాయక్ పాల్గొన్నారు.