గత బడ్జెట్లో భారీగా కేటాయింపులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది మాత్రం ఏమీలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా ఓ దినపత్రికలో వచ్చిన వార్తను ఆయన పోస్ట్ చేశారు. గత బడ్జెట్లో పెట్టిన కొన్ని పథకాలకు ప్రభుత్వం ఏడాది గడుస్తున్నా ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని ఆ కథనంలో పేర్కొన్నారు. మరికొన్నింటికేమో భారీగా కేటాయింపులు చేసినట్లు చూపించిన ప్రభుత్వం అతి కొద్ది మొత్తంలో మాత్రమే నిధులు ఇచ్చిందని పేర్కొన్నారు. వీటిని రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తూ, ’’బడ్జెట్ అంకెలు చూస్తే బారెడు.. విడుదల చేసిన నిధులు చూస్తే ఇంచెడు. ఇదీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, పెన్షనర్లు, ఇతర లబ్ధిదారులను మోసం చేస్తోన్న తీరు. బడ్జెట్ పత్రాన్ని చిత్తుకాగితం కింద మార్చిన ఘనత కేసీఆర్ దే’’ అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. కాగా, ఈ నెలాఖరున తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.