గ్రామీణ ప్రాంతాల్లో హరితహారం కార్యక్రమంలో భాగంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8 కోట్ల 76 లక్షల 30 వేల మొక్కలను నాటాలని లక్ష్యంగా నిర్ణయించామని, ఇప్పటి వరకు 7 కోట్ల 91 లక్షల 2 వేల మొక్కలను నాటామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. మిగతా మొక్కలను నాటే ప్రక్రియ ఆగస్టు నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. నల్గొండ జిల్లాలోని మునుగోడు గ్రామం వద్ద హైవే రోడ్డుపై మొక్కలు నాటుతున్న ఉపాధి హామీ కూలీలతో శుక్రవారం మంత్రి మాట్లాడారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో మల్టీలేయర్ అవెన్యూ ప్లాంటేషన్ కింద రాష్ట్రంలో 6 వేల 437 కి.మీ పొడవైన రోడ్లకిరువైపున ప్లాంటేషన్ ను చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. అందులో ఇప్పటివరకు 3 వేల 208 కి.మీ పొడవైన ప్లాంటేషన్ ను పూర్తి చేయగా..మిగతా 3 వేల 155 కి.మీ పొడవైన అవెన్యూ ప్లాంటేషన్ ను వెంటనే పూర్తి చేస్తామని తెలిపారు. నాటిన ప్రతి మొక్క సంరక్షించే విధంగా చర్యలు చేపట్టాలని మంత్రి గ్రామ పంచాయితీ సెక్రటరీ ని ఆదేశించారు.